VIRAT KOHLI: తొక్కిసలాట ఘటన.. కోహ్లీపై కేసు
తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. కోహ్లీని అరెస్ట్ చేయాలంటూ నెట్టింట డిమాండ్;
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణం అంటూ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే ఆర్సీబీ, డీఎన్ఏ మేనేజ్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదైంది.
విరాట్పై కేసు..!
ఈ తొక్కిసలాటకు కారణం విరాట్ కోహ్లీ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ ఫిర్యాదు చేశాడు. ఈ తొక్కిసలాటకు కారణం ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని వెంకటేష్ ఫిర్యాదులో తెలిపారు. ముఖ్యంగా ఉచిత పాస్లు, ప్లేయర్స్ ను కలిసే అవకాశం కల్పిస్తామని చేసిన ప్రకటనతో లక్షలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియం వద్దకు చేరుకున్నారని ఆయన ఆరోపించారు. జట్టులో కీలక ఆటగాడిగా, ప్రజల్లో విస్తృతమైన ఆదరణ కలిగిన విరాట్ కోహ్లీ, ఈ ఈవెంట్కు సంబంధించిన ప్రకటనలలో భాగస్వామ్యం వహించాడు.. కాబట్టి ఈ తొక్కిసలాటకు అతను కూడా బాధ్యుడే అని ఫిర్యాదులో వెల్లడించాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల పాటు ఆర్సీబీ జట్టుకి ఆడాడు. అతను ఆడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ కూడా రాలేదు. దీంతో అభిమానులు అవమానాలు ఎదుర్కొన్నారు. 18 సీజన్ కి టైటిల్ రావడంతో సంబురాలు జరుపుకున్నారు. కానీ తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతి చెందారు.
ఇప్పటికే నమోదైన కేసులో
కోహ్లీపై దాఖలైన ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగానే పరిగణిస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ కేసులో కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇక పోలీసులు ఇప్పటికే ఈ ఘటనలో ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA)లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కోహ్లికి వ్యతిరేకంగా ట్విటర్లో 36 వేలకు పైగా ట్వీట్లు ఉన్నాయి. తమను చూడటానికి వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోయారని తెలిసి కూడా కోహ్లి పట్టీపట్టనట్లు ఉన్నాడని చాలా మంది ఆరోపిస్తున్నారు.
ముమ్మరంగా దర్యాప్తు
మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ కమిషనర్ బీ దయానందతో పాటు పలువురు పోలీసు ఉన్న ఉన్నతాధికారులు సస్పెండ్ చేసింది. అనంతరం, సీమంత్ కుమార్ సింగ్ను కొత్త చీఫ్గా నియమించింది. ఇక ఆర్సీబీ టీమ్, కేఎస్సీఏ, డీఎన్ఏ నెట్వర్క్ తోపాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ నెట్వర్క్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు వచ్చిన సొసాలేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమంటూ సొసాలే కోర్టును ఆశ్రయించారు.