RCB: నెరవేరిన 18 ఏళ్ల కప్పు కల
ఈ సాలా కప్ బెంగళూరుదే... పంజాబ్పై గెలిచి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీ;
కల నెరవేరింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు 18వ సారి తెరపడింది. ఐపీఎల్ ఆరంభం నుంచి టైటిల్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని ముద్దాడింది. ఈ సాలా కప్ నమ్దే అంటూ సగర్వంగా ప్రకటించింది. గతంలో మూడుసార్లు ఫైనల్ వరకు చేరినా అందని ఐపీఎల్ ట్రోఫీని.. నాలుగో ప్రయత్నంలో సాధించేసింది. ఐపీఎల్ టైటిల్ను సాధించిన వేళ.. కింగ్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం అభిమానులను కూడా కదిలించింది. ఈ గెలుపుతో 17 ఏళ్ల నుంచి ఎదురవుతున్న అనుమానాలకు.. ప్రశ్నలకు.. అన్నింటికీ బెంగళూరు సమాధానం ఇచ్చేసింది.
రాణించిన బెంగళూరు బ్యాటర్లు
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు బ్యాటర్లు పర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3×4) రాణించాడు. ఫిల్ సాల్ట్ (16; 9 బంతుల్లో 2×4, 1×6) మయాంక్ అగర్వాల్ (24; 18 బంతుల్లో 2×4,1×6), రజత్ పాటిదార్ (26; 16 బంతుల్లో 1×4, 2×6), లివింగ్స్టన్ (25; 15 బంతుల్లో 2×6), రొమారియో షెఫర్డ్ (17;9 బంతుల్లో 1×4; 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జితేశ్ శర్మ (24; 10 బంతుల్లో 2×4, 2×6) మెరుపులు ఆకట్టుకున్నాయి. పంజాబ్ బౌలర్లలో జెమీసన్, అర్ష్దీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అజ్మతుల్లా, యుజ్వేంద్ర చాహల్, విజయ్కుమార్ తలో వికెట్ తీశారు.
తడబడ్డ మిడిల్ ఆర్డర్
లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ నిలకడగా బౌండరీలు బాది తొలి వికెట్కు 43 పరుగులు జోడించారు. హేజిల్ వుడ్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ప్రియాంశ్.. చివరి బంతికి ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ప్రియాంశ్ వెనుదిరిగాడు. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 52/1తో నిలిచింది. సుయాశ్ శర్మ వేసిన 8వ ఓవర్లో జోష్ ఇంగ్లిస్ రెండు సిక్స్లు కొట్టాడు. కృనాల్ వేసిన తొమ్మిదో ఓవర్లో ప్రభ్సిమ్రన్.. భువీకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (1)ని రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో వికెట్ కీపర్ జితేశ్కు చిక్కాడు. శశాంక్ సింగ్ (61*; 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు) పోరాడినా పంజాబ్కు ఓటమి తప్పలేదు. పంజాబ్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ (39; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (26), ప్రియాంశ్ ఆర్య (24), నేహల్ వధేరా (15) పరుగులు చేశారు. చివరి 30 బంతుల్లో పంజాబ్ విజయానికి 72 పరుగులు అవసరమవగా, అప్పటికే అవసరమైన రన్ రేట్ 14.40కి చేరింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన క్రమశిక్షణతో బౌలింగ్ చేసి పంజాబ్ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కృనాల్ పాండ్య 2, హేజిల్వుడ్, రొమారియో షెఫర్డ్, యశ్ దయాళ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చివరి నాలుగు బంతులకు శశాంక్ వరుసగా 6, 4, 6, 6 బాదినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆర్సీబీ తొలిసారి ఛాంపియన్గా అవతరించింది.