CWC2023: భారత్ ముందు లంక నిలవగలదా..?
మరో భారీ విజయంపై టీమిండియా కన్ను... నేడు శ్రీలంకతో రోహిత్ సేన అమీతుమీ;
ప్రపంచకప్లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా నేడు మరో మ్యాచ్కు సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్ సేన శ్రీలంకను ఢీ కొట్టబోతుంది. ఈ ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో ఊపు మీదుండగా.. శ్రీలంకను వరుస పరాజయాలు వీడడం లేదు. రోహిత్ సేన ఆడిన ఆరు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లంకేయులు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్లోనూ టీమిండియాకు అసలు శ్రీలంక కనీస పోటీ ఇస్తుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్లో గెలిచి అధికారికంగా సెమీస్ చేరాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.
వరుస విజయాలతో టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆల్రౌండర్ హార్దిక్పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్కు కూడా దూరం కానున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా గైర్హాజరీ వల్ల జట్టు సమతుల్యత దెబ్బతింది. దీనిని రోహిత్ శర్మ ఎలా అధిగమిస్తాడో చూడాలి. తొలి నాలుగు మ్యాచ్లు తుది జట్టులో స్థానం దక్కని షమీ తర్వాతి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. కేవలం రెండు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. అయితే బుమ్రా, షమీలను నాకౌట్ మ్యాచ్ల కోసం తాజాగా ఉంచేందుకు విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది.
భారత జట్టును శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఫామే ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇంతవరకూ వీరిద్దరూ భారీ స్కోర్లు నమోదు చేయలేదు. డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచులకు దూరమైన గిల్... తర్వాత జట్టులోకి వచ్చి ఒక అర్ధ శతకం మాత్రమే సాధించాడు. ఈ ఏడాది ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన గిల్.. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేయాలని భావిస్తున్నాడు. షార్ట్ బాల్ బలహీనతను అధిగమించి శ్రీలంకపై భారీ స్కోరు సాధించాలని అయ్యర్ కుడా పట్టుదలగా ఉన్నాడు. శ్రీలంక గాయాలు, కీలక ఆటగాళ్ళు దూరంగా కావడం వంటి సమస్యలతో లంక సతమతమవుతోంది. సదీర సమరవిక్రమ ఆరు మ్యాచుల్లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 331 పరుగులు చేసి లంక బ్యాటర్లలో అత్యధిక పరుగులు చేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), కుసల్ పెరెరా, పాతుమ్ నిస్సంక, లహిరు కుమార, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, కసున్ రజిత, ఏంజెలో మాథ్యూస్, దిల్షాన్ మాథ్యూస్, దిల్కషన్ మథ్యూస్ కరుణరత్నే.