Choutuppal : ‘'నాన్న అమ్మేస్తానన్నాడు.. ఇంటికి వెళ్లను'.. స్కూళ్లో దాక్కున్న విద్యార్థిని
స్కూళ్లో దాక్కున్న ఆరో తరగతి బాలిక;
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో గుండెల్ని పిండేసే ఘటన చోటు చేసుకుంది. ఓ 11 ఏళ్ల బాలిక తాను ఇంటికి వెళ్లనని స్కూళ్లోనే దాక్కుంది. ఇంటికి వెళితే తన తండ్రి కొడుతున్నాడని.. ఎవరికైనా అమేస్తానంటున్నాడని.. భయంగా ఉందని.. స్కూళ్లనే ఉంటానని చెప్పింది. దీంతో తోటి విద్యార్థులు, టీచర్లు కంటతడి పెట్టుకున్నారు. అయితే స్కూలుకు చేరుకున్న తండ్రి తన కూతుర్ని ఇంటికి పంపాలంటూ గొడవకు దిగాడు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
పిల్లలకు నాన్నే రోల్ మోడల్. ముఖ్యంగా ఆడ పిల్లలకు. అమ్మతో కంటే నాన్ననే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారికి తండ్రే తొలి హీరో. అతనితోనే వారికి ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. కానీ ఇక్కడో చిన్నారి ఆ పదం పలికితేని భయపడుతున్నది. ఇంటికి వెళ్లాలంటేనే వణికిపోతున్న ఆ బాలిక.. తండ్రిని చూసి స్కూళ్లోనే దాక్కున్న ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో చోటుచేసుకున్నది.
హైదరాబాద్ బాబానగర్కు చెందిన అక్బర్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి చౌటుప్పల్లో స్థిరపడ్డారు. ఆరో తరగతి చదువుతున్న వారి కుమార్తెను పట్టణంలోని బంగారుగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అక్బర్ భార్య తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అక్బర్.. భార్యపై తనకున్న కోపాన్ని కుమార్తెపై చూపిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో గురువారం బాలిక పాఠశాలకు వెళ్లలేదు.
అయితే మధ్యాహ్నం సమయంలో పాఠశాలకు వచ్చిన బాలిక, తన బాధను స్నేహితులతో చెప్పుకుని ఏడ్చింది. రాత్రి నుంచి ఏమీ తినలేదని, ఆకలిగా ఉందని చెప్పడంతో వారు విషయాన్ని టీచర్కు తెలిపారు. దీంతో ఆమె భోజనం పెట్టించి ఓదార్చారు. అదేసమయంలో మద్యం మత్తులో స్కూల్కు వచ్చిన తండ్రిని చూసిన చిన్నారి భయంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. పాఠశాల వెనక ఉన్న భవిత కేంద్రంలో దాక్కుంది. స్కూళ్లో కుమార్తె కనిపించకపోవడంతో అతడు ఉపాధ్యాయులతో గొడవకు దిగి, దాడికి యత్నించాడు. కొద్దిసేపటి తర్వాత అతడిని అక్కడి నుంచి పంపించేసి, బాలికను మండల వనరుల కేంద్రానికి తరలించారు. ఎంఈవో సమాచారం మేరకు పోలీసులు బాలికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి బాలికను బాల సదన్కు తరలించారు.