WARNGAL: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కయ్యం
కొండా మురళీ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం... రంగంలోకి దిగిన మంత్రి కొండా సురేఖ;
తెలంగాణలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల కయ్యం తీవ్రమవుతోంది. కొండా మురళీ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంలో ఇప్పుడు అతడి భార్య కొండా సురేఖ రంగంలోకి దిగారు. కడియం శ్రీహరి, నాయినీ రాజేందర్ రెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి నల్లికుట్లోడు అని వ్యాఖ్యానించారు. భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదని నాయినీ రాజేందర్ రెడ్డికి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కడియం శ్రీహరి, నాయినీ రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలపై శుక్రవారం మంత్రి కొండా సురేఖ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి కడియం శ్రీహరి నామోషీగా ఫీల్ అవుతున్నాడు. అందుకే నా మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. సీఎం దగ్గరకు, పొంగులేటి వద్దకు వెళ్లి నా మీద ఉన్నది లేనిది చెబుతున్నాడు' అని తెలిపారు. తెలుగు దేశంలో నడిపించుకున్నట్లు ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నాడని ఆరోపించారు. 'నా అదృష్టం ఉంది నేను మంత్రి అయ్యా. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యాడు. నన్ను, నా కూతురు దిగిపోవాలని అనుకుంటే ఎలా?' అని కొండా సురేఖ ప్రశ్నించారు. 'నా కూతురికి అదృష్టం లేదు ఎమ్మెల్యే కాలేదు. కడియం కూతురికి అదృష్టం ఉంది ఎంపీ అయ్యింది. నేను ఆమె ఎంపీ పదవి తీయాలని అంటున్నానా?' అని సురేఖ పేర్కొన్నారు. భద్రకాళి ఆలయంలో బోనాలపై ఎమ్మెల్యే నాయిని చేసిన వ్యాఖ్యలకు సురేఖ కౌంటర్ ఇచ్చారు.
కొండాపై కాంగ్రెస్ అసంతృప్తి
కాంగ్రెస్ అధిష్ఠానం.. కొండా సురేఖపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెతో కాంగ్రెసు పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కూడా ఏకాంతంగా మాట్లాడి వివరణ తీసుకుంది. సురేఖ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయని, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని ఊహాగానాలు సాగాయి. సోషల్ మీడియాలో కొండా సురేఖను పదవి నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారనే ప్రచారం జరిగింది. 2024 అక్టోబర్లో హీరో నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత అధిష్ఠానం సీరియస్గా స్పందించినట్లు సమాచారం. సురేఖ వ్యవహారశైలి పార్టీకి నష్టం కలిగిస్తోందని, రేవంత్ రెడ్డి ఆమెను సమర్థించడం కష్టమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా ఆమె స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు సాగాయి. కొండా సురేఖ రాజకీయ నేపథ్యం, ఆమె పార్టీలో బలం కూడా ఈ విషయంలో కీలకం. భద్రకాళి ఆలయ వివాదం నుంచి మొదలుకొని, తన మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
నా భార్య పదవికి ఢోకా లేదు: మురళీ
వరంగల్ రాజకీయాల్లో ఆమె గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. బీసీ నాయకురాలిగా ఆమెకు గట్టి మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను తొలగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచన రేవంత్ రెడ్డిని ఆగి ఆలోచించేలా చేస్తోంది. అయితే, వరుస వివాదాలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సురేఖ భర్త కొండా మురళి ‘నా భార్యకు ఏమీ ఢోకా లేదు’ అని చెప్పాడు.
భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "భద్రకాళి ఆలయం ఎవరి సొంత ఆస్తి కాదు. కానీ కొందరు అది తమదే అన్నట్లుగా భావిస్తున్నారు" అంటూ నాయినిని ఉద్దేశించి విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు నాయిని రాజేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. భద్రకాళి అమ్మవారికి ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, అయితే అక్కడ జంతుబలులు ఇస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. "అమ్మవారు శాకాహారి అనే విషయం అందరికీ తెలుసు. ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న అర్చకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకొచ్చి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం" అని సురేఖ స్పష్టం చేశారు.