CM REVANTH: మహిళలను వేధిస్తే వదిలి పెట్టం: సీఎం రేవంత్రెడ్డి
సైబరాసురులకు గట్టి హెచ్చరిక
మహిళలు ధైర్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని.. ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగితే నిలబడి ప్రశ్నించే ధైర్యం సమాజంలో రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.. కాలేజీలు, బస్టాండ్లు సహా ఎక్కడైనా జరిగే వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలపై సైబర్ వేధింపులు పెరుగుతున్నాయని.. మహిళలపై మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వంటి సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు సీఎం రేవంత్రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు.. మహిళ నాయకత్వం నుంచి వచ్చిన పార్టీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మహిళా రాష్ట్రపతి బిల్లు ఆమోదం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇతర ఉన్నత విభాగాల్లో పనిచేసేలా మహిళలకు అవకాశం కల్పించిన 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు.
మహిళల రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిని తమ బాధ్యతగా తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగితే చూసి చూడనట్లు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమేనని ఆయన హెచ్చరించారు. కాలేజీలు, బస్టాండ్లు, పబ్లిక్ ప్రదేశాలు ఎక్కడైనా ఇలాంటి ఘటనలు కనిపిస్తే ప్రజలు ధైర్యంగా ఎదిరించాలన్నారు. మహిళలు కూడా తమ హక్కుల కోసం ధైర్యంగా ముందుకు రావాలని సీఎం సూచించారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను ధైర్యంగా వినియోగించుకోవాలని, సమాజంలో తమ స్థానాన్ని బలపరచుకోవాలని ఆయన సూచించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా మహిళలకు కీలక అధికార పదవుల్లో అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం చెప్పారు.
మహిళ దినోత్సవంతో బాధ్యత తీరిపోదు:సీఎం
మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే సరిపోదని, అవి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల అసలు బాధ్యత నెరవేరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. మహిళలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, వారిని నాయకత్వ స్థానాలకు తీసుకెళ్లడం కూడా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి మహిళా సాధికారతపై విస్తృతంగా మాట్లాడారు.అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే కుటుంబం బలపడుతుందని అన్నారు.