REVANTH: రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాం

బీఆర్ఎస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి తీవ్ర విమర్శలు;

Update: 2025-06-17 05:00 GMT

బీఆర్ఎస్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో రైతులను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటివరకూ తమ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ కొందరికే చుట్టంగా మారిందన్న రేవంత్... మొదటి రోజు నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని గులాబీ నేతలు కుట్ర చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రుణమాఫీ చేయలేకపోతే మేం ఆరు నెలల్లోనే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైతువేదికల్లో ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. యూనివర్సిటీ ఆడిటోరియం నుంచి మరో 1034 రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

పదేళ్లు అధికారం మాదే: రేవంత్

మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. రైతునేస్తం వేదిక నుంచి బటన్‌ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమచేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, సీఎం అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం' అని ఆయన అన్నారు. "రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం" అని ఆయన అన్నారు. "ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు" అని తమ ప్రభుత్వ ఘనతను చాటుకున్నారు.

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలో కోటీ 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా స్కీమ్ వర్తిస్తుంది. అలానే 70,11,984 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. వచ్చే 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అందిస్తామని సీఎం తెలిపారు.

కలెక్టర్‌ను అభినందించిన సీఎం రేవంత్

ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని CM రేవంత్ రెడ్డి అభినందించారు. ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలు, అనుభవం గల వైద్యులు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలి. సర్జరీ చేయించుకుని ఆ నమ్మకాన్ని కలిగించిన కలెక్టర్ పమేలా సత్పతికి నా అభినందనలు’ అని 'X' లో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News