తెలంగాణ ప్రజల సమస్యలపై ఉదృతంగా పోరాటం చేస్తామన్నారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్. నాంపల్లి టీజేఎస్ కార్యాలయంలో ఆయన 48 గంటలు దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా విద్యావేత్త చుక్కా రామయ్య అక్కడికి వచ్చి దీక్షకు మద్దతు తెలిపారు. ఇందిరా పార్క్ దగ్గర రెండు రోజుల దీక్ష చేపట్టాలి అనుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చివరికి పార్టీ ఆఫీస్లో దీక్షకు కూర్చున్నారు. బతుకుదెరువు నిలబెట్టాలి-తెలంగాణను కాపాడాలి నినాదంతో కోదండరామ్ రెండ్రోజుల దీక్ష చేస్తున్నారు.
ప్రజలకు మంచి జరగాలని కోదండరామ్ నిస్వార్థంగా పనిచేస్తున్నారని చుక్కా రామయ్య అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, పంటలకు గిట్టుబాటు ధరపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై పోరాడలి అనుకునే అన్ని పార్టీలతో కలిసి మహోదృతంగా ఉద్యమం చేస్తామన్నారు కోదండరామ్. ఒక్క దీక్షతో ప్రభుత్వం దిగి వస్తుందని అనుకోవడం లేదన్నారు. గతంలోనూ ఇదే అంశాలపై అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు.