REVANTH:గాంధీ సరోవర్ వద్ద గేట్ వే ఆఫ్ హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు... అధునాతనలతో ప్రాజెక్టులతో అభివృద్ధి... పర్యాటకులకు స్వాగతం పలికేలా గేట్ వే;
హైదరాబాద్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ను బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారంగా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్ వే అఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు. ఓఆర్ఆర్ కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి మరోవైపున బాపూ ఘాట్ వైపు భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని.. అందుకు తగిన విధంగా డిజైన్లు రూపొందించాలని సీఎం అదేశించారు. ఓఆర్ఆర్ కు ఒక వైపున ఉండే ఎకో థీమ్ పార్క్.. మరో వైపున నిర్మించే ఐకానిక్ టవర్ కు చేరుకునేందుకు ప్రయాణాలకు వీలుగా ఎలివేటెడ్ గేట్ వే నిర్మించి దాన్ని గేట్ వే అఫ్ హైదరాబాద్ గా డిజైన్ చేయాలని సీఎం అదేశించారు.
ప్రపంచంలోనే ఎత్తైన టవర్, ఎకో థీమ్ పార్కు
'గేట్ వే ఆఫ్ హైదరాబాద్' ప్రాజెక్ట్లో భాగంగా ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)కు ఒక వైపు ఎకో థీమ్ పార్కును, [మరో వైపు బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన టవర్ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ఐకానిక్ టవర్ కోసం అవసరమైన డిజైన్లు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా.. ఈ థీమ్ పార్కు, టవర్ను అనుసంధానం చేస్తూ ఒక ఎలివేటెడ్ గేట్వేని నిర్మించాలని చెప్పారు. ఇది విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ సరోవర్కు చేరుకునేలా ఒక కనెక్టివ్ కారిడార్గా ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది.
రెండు నెలల్లో టెండర్లు
తాగు నీటితోపాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఉండాలని, వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టు నమూనాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగు నీటిని హైదరాబాద్ నగర అవసరాలు తీర్చేందుకు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ప్లానింగ్ చేయాలన్నారు. గాంధీ సరోవర్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు వాటర్ ఫ్లో స్టడీస్ పక్కాగా చేసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను అదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ కోసం కులీకుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించాలని, మరింత బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పాతబస్తీ మెట్రోకు ఇప్పటికే నిధులు విడుదల చేశామని,పనులు వేగవంతం చేయాలని చెప్పారు.