REVANTH: రెండేండ్లలో ఉస్మా"నయా": సీఎం రేవంత్
వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా.. రెండేళ్లలో కొత్త భవన నిర్మాణ పనులు పూర్తవ్వాలి.. వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ
హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఆస్పత్రి నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని చెప్పారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రి నిర్మాణం, సౌకర్యాలను ప్లాన్ చేయాలని తెలిపారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లు గదులు, ల్యాబ్లు, ఇతర నిర్మాణలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీ హెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్మాణ సమీక్ష చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
స్థానికులకు ఇబ్బందులు లేకుండా...
స్థానికులకు ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ ఆసుపత్రుల పనుల పర్యవేక్షణకు అధికారుల నియామకం జరిగిందన్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్, భద్రతా ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలని పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాసరాజు, శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఎంఏ అండ్ యూడీ సెక్రటరీ ఇలంబర్తి, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి పూర్తయ్యాక అక్కడ రక్షణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని ప్రధాన రహదారులతో అనుసంధానించే రహదారి ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పర్యవేక్షకులను నియమించాలన్న సీఎం
హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని రేవంత్ ఆదేశించారు. నిర్మాణాలపై 24x7 ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లో పాటు వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న దవాఖానలు, మెడికల్ కళాశాలల పర్య వేక్షణకు అధికారులను నియమించా అని ఆదేశించారు.