తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సారథి ఎవరన్నది ఇంకా తేలలేదు. ఇవాళ, రేపు అంటూ లీకులు రావడమే తప్ప.. ఎవరు టీపీసీసీ బాస్ అన్నది అధికారికంగా ప్రకటించడం లేదు.. ట్విస్ట్ల పై ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తి అయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని అధిష్ఠానానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హైకమాండ్ పెద్దలకు జానారెడ్డి ఫోన్ చేశారు. పీసీసీ గొడవ ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడుతుందని హస్తిన పెద్దలకు జానారెడ్డి తేల్చిచెప్పారు. ఉప ఎన్నికల ముందు ప్రకటనతో నేతల్లో ఐక్యత లోపిస్తుందని హెచ్చరించారు. జానారెడ్డి విజ్ఞప్తితో పీసీసీ ఎంపిక విషయంలో ఏఐసీసీ తర్జన భర్జనలు పడుతోంది.
ఇప్పటికే జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయాలు సేకరించారు. ఈ విషయంపై ఎంపీ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని హస్తినకు పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.తాజాగా జానారెడ్డి సూచనతో పీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఉత్కంఠగా మారింది.
అయితే ఎవరూ ఊహించని విధంగా టీపీసీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేరు అనూహ్యంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ రేవంత్రెడ్డే కాబోయే చీఫ్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. రేవంత్ను ప్రచార కమిటీ చైర్మన్గా నియమించనున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే రేవంత్రెడ్డిని పీసీసీ చీఫ్గా పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు సీనియర్లు అంగీకరించడం లేదని తెలుస్తోంది.