Jaish Women Wing: మహిళలకు జైషే ఉగ్రవాద సంస్థ ఆన్‌లైన్ జీహాద్ కోర్సు

5000 మంది.. 40 నిమిషాల ‘ఆత్మాహుతి’ శిక్షణ

Update: 2025-12-04 05:30 GMT

 పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారత భద్రతా సంస్థలను కలవరపెట్టే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. జైష్ చీఫ్ మసూద్ అజార్ నేతృత్వంలో తాజాగా ప్రారంభించిన మహిళా వింగ్ 'జమాత్ ఉల్ మోమినాత్'లో కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను నియామకం చేశారు. ఈ విషయాన్ని నేరుగా మసూద్ అజార్‌యే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి, తీవ్రవాద చర్యలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి.

మసూద్ అజార్ స్వయంగా సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. "కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలు జమాత్ ఉల్ మోమినాత్‌లో చేరడం దేవుడి దయ. నియామకం అయిన వెంటనే వారి మనస్తత్వం మారి, జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నామని అనేక మంది సోదరీమణులు చెప్పారు" అని అజార్ పేర్కొన్నాడు. ఈ నియామకాలు అక్టోబర్ 8వ తేదీన జైష్ ప్రధాన కార్యాలయం మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ వద్ద ప్రారంభం అయ్యాయి. పాకిస్థాన్‌లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి వంటి ప్రాంతాల నుంచి మహిళలను ఇందులో చేర్చుకున్నారు.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. మహిళలను ఆన్‌లైన్ ద్వారా రిక్రూట్ చేసి, శిక్షణ ఇస్తున్నారు. ఈ ఆన్‌లైన్ తరగతులు 40 నిమిషాలు ఉంటాయని.. ప్రతి సభ్యురాలు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఐఎస్‌ఐఎస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఫిదాయిన్ (ఆత్మాహుతి) దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది. అయితే జమాత్ ఉల్ మోమినాత్ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో సాదియా భర్త యూసుఫ్ అజార్ మృతి చెందాడు.

ఈ వింగ్‌లో కీలకమైన మరో మహిళా కూడా ఉంది. ఆమె మరెవరో కాదు పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా. ఎన్‌కౌంటర్‌లో ఫరూక్ మరణించిన తర్వాత ఆమె ఈ విభాగంలో చేరింది. ఈ మహిళా వింగ్‌లో చేరిన సభ్యులకు పురుషుల తరహాలోనే 'దౌరా-ఎ-తస్కియా' అనే ఇండక్షన్ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ వద్ద జరుగుతుంది. ఈ బ్రిగేడ్‌లో చేరే మహిళలు తమ భర్తలు లేదా అత్యంత దగ్గరి కుటుంబ సభ్యులు తప్ప, ఇతర "సంబంధం లేని పురుషులతో ఫోన్ లేదా మెసెంజర్ ద్వారా మాట్లాడకూడదు" అనే కఠిన నియమాన్ని అజార్ విధించాడు.

Tags:    

Similar News