Air India: ఎయిరిండియా అంతర్జాతీయ సేవలు కుదింపు

ప్రయాణికుల అసౌకర్యానికి క్షమాపణ చెప్పిన ఎయిరిండియా;

Update: 2025-06-20 03:15 GMT

ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ సేవలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. జూన్ 12 అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇక 3 నగరాలకు కార్యకలాపాలను కూడా నిలిపేసింది. ఘోర విమాన ప్రమాదం తర్వాత నిత్యం అంతరాయాలతో సతమతమవుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది.

జూన్ 21 నుంచి జూలై 15 వరకు 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులు తగ్గిస్తున్నామని.. అలాగే 3 విదేశీ గమ్యస్థానాలు నిలిపివేస్తున్నట్లు గురువారం ఎయిరిండియా వెల్లడించింది. ఇక వైడ్-బాడీ విమానాలతో నడిచే విమానాలను తాత్కాలికంగా 15 శాతం తగ్గిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) లలో జూలై 15 వరకు సేవలు నిలిపివేశారు. ఢిల్లీ-నైరోబి మార్గంలో వారానికి నాలుగు విమానాలు నడుస్తుండగా.. అమృత్సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) మార్గాల్లో వారానికి మూడు విమానాలు నడుస్తున్నాయని ఎయిర్‌లైన్ తెలిపింది. అంతేకాకుండా ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాలలోని నగరాలను అనుసంధానించే 16 అంతర్జాతీయ మార్గాల్లో కూడా విమానాలు తగ్గిస్తున్నట్లు చెప్పింది. ఉత్తర అమెరికాలో ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్, ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-వాషింగ్టన్ మార్గాల్లో విమాన సర్వీసులు తగ్గనున్నాయి. అలాగే యూరప్‌లోని ఢిల్లీ-లండన్ హీత్రో, బెంగళూరు-లండన్ హీత్రో, అమ్రిస్ట్సర్-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-బర్మింగ్‌హామ్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-మిలన్, ఢిల్లీ-కోపెన్‌హాగన్, ఢిల్లీ-వియన్నా, ఢిల్లీ-ఆమ్స్టర్‌డామ్ మార్గాల్లో కూడా విమాన సేవలు తగ్గాయి. అదే విధంగా సవరించిన షెడ్యూల్‌లో భాగంగా ఢిల్లీ-మెల్‌బోర్న్, ఢిల్లీ-సిడ్నీ, ఢిల్లీ-టోక్యో హనేడా మరియు ఢిల్లీ-సియోల్ (ఇంచియాన్) సర్వీసులను కూడా తగ్గించారు.

సర్వీసులు తగ్గించడం కారణంగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. కేవలం మెరుగైన సేవలు అందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు వాపస్ ఇచ్చేస్తామని.. లేదంటే ప్రత్యామ్నాయ విమానాల్లో వసతి కల్పించడం వంటివి చేస్తామని వెల్లడించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.

Tags:    

Similar News