INDONESIA: భారీ వర్షాలతో ఇండోనేషియాలో 21మంది మృతి
జనజీవనం అతలాకుతులం... సురక్షిత ప్రాంతాలకు 80 వేల మంది;
భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలమవుతోంది. సుమత్ర ద్వీపాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తగా.... 21 మందిని మృత్యువు కబళించింది. ఎడతెగని వర్షాల కారణంగా రహదారులు నదులను తలపిస్తున్నాయి. వేలకొద్ది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక మంది నివాసితులు రోడ్డున పడ్డారు. సుమారు 80 వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇండోనేషియా సుమత్ర ద్వీపంలో కుంభవృష్టి వల్ల తలెత్తిన వరదల్లో 21 మంది మృతి చెందగా మరో ఏడుగురు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ద్వీపం పశ్చిమ భాగంలోని పెసిసిర్ సెలటన్ జిల్లాలో నది ఉప్పొంగడంతో టన్నుల కొద్ది మట్టి, బండరాళ్లు నివాసాల్లోకి వచ్చినట్లు విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. కుండపోత కారణంగా భారీ వృక్షాలు సైతం నేలకొరిగినట్లు వెల్లడించారు. గ్రామాల్లోకి మోకాళ్ల లోతున నీరు చేరింది. వర్షంలోనే బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద ఉద్ధృతితో రహదారులన్ని నదులను తలపిస్తున్నాయి.
ఆకస్మిక వరదల కారణంగా రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గల్లంతయిన ఏడుగురి కోసం సిబ్బంది గాలిస్తున్నట్లు వెల్లడించారు. కొండచరియలు విరిగిపడి 200 ఇళ్లు నేలమట్టం అయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. సుమత్ర ప్రావిన్స్లోని 9 జిల్లాల్లో 20 వేల ఇళ్లు ఈ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగినట్లు అధికారుల పేర్కొన్నారు.పలు చోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడి చాలా మార్గాలు మూసుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
వరద బాధితుల కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశామని..వారికి ఆహారం, ఔషధాలు, మంచినీరు సమకూరుస్తునట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పడాంగ్ ప్రాంతం మొత్తం నీటిలోనే ఉందని అధికారులు చెప్పారు. రాబోవు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు