South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం..
28 మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు..;
సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ముయూన్ ఎయిర్పోర్టు రన్వేపై విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని సమాచారం. కాగా, ఇప్పటి వరకు 28 మంది మరణించగా.. మరో 23 మందికి గాయాలు అయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బ్యాంకాక్ నుంచి ముయూన్కు వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల్లో 173 మంది దక్షిణ కొరియాకు చెందినవారు కాగా, ఇద్దరు థాయ్ జాతీయులని తెలిపారు.
కాగా, ఈ నెల 26న అజర్బైజాన్ విమానం కూలిన ప్రమాదంలో 40 మంది మరణించగా, 27 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రయాణికులలో 37 మంది అజర్బైజాన్ వాసులు, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజకిస్థానీలు, ముగ్గురు కిర్గిస్థానీ పౌరులు ఉన్నారు. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయల్దేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్థాన్లోని అక్టౌ విమానాశ్రయానికి మరలించారు. విమానం దానికి దగ్గర్లో ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షి ఢీకొనడంతో కుప్ప కూలి మంటలు చెలరేగాయి.