Congo: కాంగోలో ఊచకోత..
నిద్రపోతున్న ప్రజలను లేపి.. గొడ్డళ్లతో నరికి చంపేశారు..;
ఆఫ్రికా దేశమైన కాంగోలో తిరుగుబాటుదారులు పౌరులపై ఊచకోతకు దిగారు. ఈసందర్భంగా స్థానిక అధికారులు మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని నరికి చంపేశారని తెలిపారు. కాంగో దళాల చేతిలో ఓటమి పాలవడంతో రగిలిపోయిన అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బెని, లుబెరో ప్రాంతాల్లో ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు పౌరులపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
ఇస్లామిక్ స్టేట్తో ముడిపడి ఉన్న తిరుగుబాటు సంస్థ ఏడీఎఫ్ నిద్రపోతున్న ప్రజలను లేపి తాళ్లతో చేతులు కట్టి కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపారన్నారు. మెలియా గ్రామంలోనే దాదాపు 30 మంది ప్రాణాలు తీశారన్నారు. ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఇళ్లకు కూడా నిప్పంటించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏడీఎఫ్పై అమెరికా, ఐరాస భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి. ఈ సంస్థ ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా కొన్నేళ్లుగా దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 6వేల మందికి పైగా బలిగొన్నట్లు నివేదికలు ఉన్నాయి.