Agroterrorism : అమెరికా, భారత దేశాల్లోకి చైనా భయానక ఫంగస్..

మనుషులు, పశువులకు అత్యంత ప్రమాదకరం;

Update: 2025-06-05 03:15 GMT

ఇప్పుడు చైనా మరో కొత్త ఉపద్రవానికి తెరతీసినట్లు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, భారత్ దేశాలే లక్ష్యంగా చైనా అగ్రో టెర్రరిజానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా అమెరికాలో ఇద్దరు చైనా జాతీయులు అరెస్టు అయ్యారు. వారి నుంచి అమెరికన్ అధికారులు ప్రమాదకరమై ఫంగస్‌ను గుర్తించారు. ఆ ప్రమాదకరమైన ఫంగస్‌ను స్మగ్లింగ్ చేస్తున్నారని ఇది అత్యంత తీవ్రమైన జాతీయ భద్రతా ముప్పుగా ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెచ్చరిక చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చర్యల వల్ల దేశాల మధ్య ఆహార సరఫరా దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడవచ్చని ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది.

ఎఫ్‌బీఐ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అగ్రో టెర్రరిజం అనే పదం తెగ వైరల్ అవుతోంది. దీంతో ప్రతీ ఒక్కరు అగ్రో టెర్రరిజం అంటే ఏంటో తెలుసుకోవాలని చూస్తున్నారు. అందుకోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అగ్రో టెర్రరిజం అంటే అగ్రికల్చరల్ టెర్రరిజం అని అర్థం. ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, ఆహార కొరత లేక సామాజిక అశాంతిని కలిగించే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలోకి తెగుళ్లు, వ్యాధులు, వ్యాధి కారకాలనను ఉద్దేశ పూర్వకంగా ప్రవేశ పెట్టడాన్నే అగ్రో టెర్రరిజంగా వ్యవహరిస్తుంటారు.

ఉగ్రవాద చర్యల్లో భాగంగా పౌరులు, మౌలిక సదుపాయాలపై దాడులు చేసినట్లుగానే ఈ అగ్రో టెర్రరిజంలో మొక్కలు, ఆహార వ్యవస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతాయి. అమెరికా అరెస్టు చేసిన చైనా వ్యక్తుల దగ్గర పుసేరియంం గ్రామినీరమ్ అనే ఫంగస్‌ను గుర్తించారు. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా వంటి ఖండాల్లో దీని ఉనికి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫంగస్ కొత్త ప్రాంతాల్లో వ్యాపిస్తే.. తీవ్ర స్థాయి పరిణామాలు ఉండటాయి. అందుకే దీనిని దేశ సరిహద్దులు దాటించే విషయంలో కఠిన నియంత్రణలు ఉన్నాయి.

ఈ ఫంగస్‌తో గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి పంటలకు ఫ్యూసేరియం హెడ్ బ్లైట్ అనే వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి పూతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి ఉన్న ధాన్యాలు వామిటాక్సిన్ అని పిలిచే విషపూరితాలతో కలుషితమై తినడానికి పనికిరాకుండా పోతుంది. ఒకవేళ ఆ ధాన్యాన్ని తిన్నా మనుషుల్లో, జంతువుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ తెగులు వల్ల ఒక్క అమెరికాలోనే 1990ల నుంచి గోధుమ, బార్లీ రైతులకు 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఈ వ్యాధి సోకిన పంట నుంచి విష పదార్థాలను తొలగించేందుకు ధాన్యాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. అగ్రో టెర్రరిజం ప్రభావం చాలా వేగంగా ఉంటుంది. అదే సమయంలో కోలుకోవడం మాత్రం చాలా చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇప్పటి వరకైతే అగ్రో టెర్రరిజం దాడులు జరిగిన సందర్భాలు అత్యంత అరుదు. అందుకే నిఘా, బయో సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ తరహా ముప్పును అడ్డుకునేందుకు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి.


Tags:    

Similar News