Donald Trump: 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం
అఫ్గానిస్థాన్, ఇరాన్ సహా 12 దేశాల పౌరులకు అమెరికాలోకి నో ఎంట్రీ..;
రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా యూఎస్కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించారు. బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.
కొలరాడోలో ఇటీవల యూదులపై సీసాబాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. కాగా.. బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్కమేనిస్థాన్, వెనెజువెలా వంటి మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్హౌస్ అధికారులు తెలిపారు.
‘కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే.. మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరప్లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కానీ దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేము. అందుకే ఈ రోజు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా’ అని ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు. 2017లో యూరప్లో జరిగిన ఉగ్రదాడిని గురించి ఆయన ప్రస్తావించారు.
ఈ ప్రకటనపై వెనిజువెలా మంత్రి డియోస్టాడో కాబెల్లో స్పందించారు. యూఎస్లో ఉండటం వెనిజువెలా ప్రజలకు మాత్రమే కాదు.. ఎవరికైనా ప్రమాదమే అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమ దేశ పౌరులు అగ్రరాజ్యంలో పర్యటించవద్దని సూచించారు. ఇక, ట్రంప్ చేసిన ఈ ప్రయాణ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంమధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ట్రంప్ మరో కీలకమైన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆ యూనివర్సిటీలో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలను పరిమితం చేసే ఉత్తర్వులు అవి. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించే వారు మాకు వద్దంటూ.. హార్వర్డ్ అలాంటివారికి నిలయంగా మారిందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ తాజా ఉత్తర్వులు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మాత్రమే వర్తిస్తోందని, దేశంలోని ఇతర సంస్థలకు కాదని యూఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది.