జర్మనీ పార్లమెంట్ రద్దైంది. జర్మనీ పార్లమెంట్ను అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ రద్దు చేశారు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్ను రద్దు చేశారు. దీంతో 7 నెలలకు ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. ఫిబ్రవరి 23న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. సుస్తిరమైన ప్రభుత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ వెల్లడించారు. దేశానికి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు ఇదొక్కటే సరైన మార్గమని పేర్కొన్నారు. ఇక తాత్కాలిక ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్కు అప్పగించారు.
డిసెంబర్ 16న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ పార్లమెంటు విశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. 733 మంది సభ్యులున్న సభలో ఓటింగ్ జరగ్గా.. ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు. 116 మంది గైర్హాజరయ్యారు. మెజారిటీకి 367 ఓట్లు అవసరం. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమైంది. నవంబరు 6వ తేదీన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి మైనారిటీ ప్రభుత్వానికి షోల్జ్ నాయకత్వం వహిస్తున్నారు. స్తబ్దత నెలకొన్న ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంపై వివాదం తలెత్తడంతో అప్పట్లోనే ఆయన ఆర్థిక మంత్రిని తొలగించారు. ఆ సమయంలోనే నిర్ణీత సమయాని కంటే 7 నెలల ముందుగా వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లాలనే అంగీకారానికి ప్రధాన పార్టీల నేతలు వచ్చారు.