Pakisthan : లాహోర్లో స్కూళ్లు మూసివేసిన ప్రభుత్వం, కారణం ఎంతంటే ..
మన దేశం నుంచి వీచే గాలులతో వాయు కాలుష్యం పెరిగిందన్న;
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని వింత వాదన తెరపైకి తెచ్చింది. ఈమేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. శీతాకాలంలో ఢిల్లీ, హర్యాణా, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అసాధారణ స్థాయిలో రికార్డవుతుంది. మన దేశంలోనే కాదు పాకిస్థాన్ లోనూ పంజాబ్ రాష్ట్రం ఉంది. అక్కడి లాహోర్ సిటీలో వాయు కాలుష్యం ఇటీవల భారీగా పెరిగింది.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సు లాహోర్(Lahore)లో గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ దాటిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో లాహోర్ ముందు వరుసలో నిలిచింది. దీంతో వారం రోజులపాటు ప్రైమరీ స్కూళ్ళు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. లాహోర్ నగరం మొత్తం పొగమంచుతో కమ్ముకుంది. నగర ప్రజలంతా ఇళ్ళల్లోనే ఉండాలని, కిటికీలు కూడా మూసి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ప్రావిన్సు మంత్రి మరియమ్ ఔరంగజేబ్ మీడియాకు తెలిపారు.