Sunita Williams: మీడియా ముందుకొచ్చిన సునీతా టీం

ఐఎస్ఎస్ జర్నీ గురించి ముచ్చట్లు;

Update: 2025-04-01 04:30 GMT

 భార‌తీయ సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌  286 రోజుల పాటు అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే భూమి మీద‌కు వ‌చ్చిన ఆ వ్యోమ‌గామి విల్మోర్‌తో క‌లిసి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 1 రాత్రి 12 గంటలకు నాసా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్‌లో సునీతా, విల్‌మోర్, నిక్‌ హేగ్ తమ ఆరోగ్య పరిస్థితి, ఐఎస్ఎస్ ప్రయాణం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు బాగానే ఉందన్నారు. తమను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు సహకరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌లకు ధన్యవాదాలు తెెలిపారు. అవకాశం వస్తే మళ్లీ స్టార్‌ లైనర్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్తారా? అనే ప్రశ్నకు సునీతా స్పందిస్తూ.. తప్పకుండా అని, అది చాలా సామర్థ్యం గల స్పేస్‌క్రాఫ్ట్ అని బదులిచ్చారు. కానీ, దానిలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతేకాదు, మా మిషన్ వారం రోజులే అయినా.. . ఒకవేళ అనుకోని అవాంతరాలు ఏదురైతే దీర్ఘకాలం ఉండేలా సిద్దమై వెళ్లామని వివరించారు. ‘మా ఫోకస్ మొత్తం మిషన్ పైనే ఉంది, స్టార్‌లైనర్ మిషన్‌లో ఓ భాగం.. అదే మా ఫోకస్.. కానీ మేము ప్రతిదానికీ శిక్షణ పొందాం... అంతరిక్ష కేంద్రంలో నిర్వహణ, స్పేస్‌వాక్‌లు, రోబోటిక్స్, ఆర్మ్ వర్క్. మేము అన్నింటికీ శిక్షణ తీసుకున్నాం.. చాలా కాలం పాటు ఉండాల్సి వచ్చినా అందుకు మేము సిద్ధమై వెళ్లాం’ అని సునీతా విలియమ్స్ తెలిపారు.

ఈ సందర్భంగా తమ మిషన్‌ సక్సెస్ కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా మిషన్‌ కంట్రోల్‌ బృందాలు తాము భూమికి తిరిగి రావడానికి, రిహాబిలిటేషన్, భూ వాతావరణానికి అలవాటుపడేందుకు ఎంతో సహాయం చేశాయని చెప్పారు. ఐఎస్ఎస్ నుంచి వచ్చిన తర్వాత తాను ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తానని పేర్కొన్నారు. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి సహకరించిన ట్రెయినర్లకు సునీతా ధన్యవాదాలు తెలిపారు. ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ తీసుకున్నామని పేర్కొన్నారు. అంత‌రిక్షం నుంచి ఇండియా ఎలా క‌నిపించిందో చెప్పిందామె. ఉత్త‌ర భార‌తంలోని హిమాల‌యాలు అద్భుతంగా ఉన్న‌ట్లు సునీతా పేర్కొన్న‌ది. హిమాల‌యాలు అమేజింగ్‌గా ఉన్న‌ట్లు చెప్పిన ఆమె.. ఆ ప్రాంతం నుంచి ప్ర‌యాణించిన ప్ర‌తిసారీ త‌న తోటి ఆస్ట్రోనాట్ విల్మోర్ ఫోటోలు తీసేవార‌ని తెలిపింది. 

మరో వ్యోమగామి విల్‌మోర్ మాట్లాడుతూ.. ‘‘కొన్ని విషయాల్లో మేము చిక్కుకుపోయి ఉండొచ్చు.. కానీ మమ్మల్ని మర్చిపోయారు.. వదిలేశారనే వాటిని పట్టించుకోలేదు.. అనుకున్న విధంగా తిరిగి రాలేకపోయాం. కానీ, మేము అందుకు అనుగుణంగా శిక్షణ పొందాం’’ అని పేర్కొన్నారు. మానవసహిత అంతరిక్ష యాత్ర ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తీసుకొస్తుందని పేర్కొన్నారు.

స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం, ఇంధనం లీకేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న నాసా, బోయింగ్‌ సిబ్బంది నిబద్ధతను విల్‌మోర్ కొనియాడారు. నాసాపై తమకు ఎంతో నమ్మకముందని, సురక్షితంగా భూమిపైకి చేరడంలో దానికి నిబద్ధతకు ఇదో మైలురాయి అని అభివర్ణించారు.

Tags:    

Similar News