India Advisory Iran: ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక

కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ

Update: 2026-04-08 08:30 GMT

ఇరాన్ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' వేదికగా పోస్టును పంచుకుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రికత్తలు సర్దుమణుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించారు. శాశ్వత పరిష్కరం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు.. కాల్పల విరమణపై తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ భారతీయుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం మరో కొత్త అడ్వైజరీని జారీ చేసింది. అక్కడ ఇంకా మిగిలి ఉన్న భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని రాయబార కార్యాలయం సూచించింది. ఏప్రిల్ 7న ఇచ్చిన ‘స్టే అట్ హోమ్’ హెచ్చరికల కొనసాగింపుగా ఈ తాజా ప్రకటన వెలువడింది. ముఖ్యంగా ఎవరూ కూడా ముందస్తు సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వైపు వెళ్లకూడదని, కేవలం ఎంబసీ సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు రాయబార కార్యాలయం అత్యవసర సమయంలో సంప్రదించేందుకు ఫోన్ నెంబర్లను ఇచ్చింది. +989128109115; +989128109109; +989128109102; +989932179359, మెయిల్ ఐడి - cons.tehran@mea.gov.in ను షేర్ చేసింది.

ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా అదుపులోకి వచ్చాయి. తాను ఇరాన్‌పై విధించిన డెడ్‌లైన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను విధించిన గడువు ముగియడానికి కేవలం రెండు గంటల ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు. అంతకు ముందు రోజు 48 గంటల డెడ్‌లైన్ విధించిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గడం ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే.. తాజాగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ మరో షరతు విధించారు. ఇరాన్ తన క్షిపణి దాడులను ఆపి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తేనే ఈ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ చేరుకుందని, మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు.

Tags:    

Similar News