Qatar : అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్‌ దాడులు..

ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక అడ్వైజరీ;

Update: 2025-06-24 04:30 GMT

ఖతార్‌ లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీ‌ద్‌పై  ఇరాన్‌ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడులతో భారత్‌ అప్రమత్తమైంది. ఖతార్‌లోని తమ పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖతార్‌లోని భారతీయులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు అందించే సూచనలు, మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితిపై రాయబార కార్యాలయం కూడా సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్స్‌ ఇస్తుందని తెలిపింది. ఈ మేరకు ఖతా‌ర్‌లోని భారత రాయబార కార్యాలయం   వేదికగా పోస్టు పెట్టింది.

తమ అణుకేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా జరిపిన దాడులకు ఇరాన్‌  ప్రతీకార దాడులకు దిగింది. సోమవారం రాత్రి ఖతార్‌ లోని అమెరికా వైమానిక స్థావరం అల్-ఉదీ‌ద్‌పై క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇరాన్‌ సాయుధ దళాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ‘ఇరాన్‌ భూభాగంపై జరిగే ఎలాంటి దాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం ఇవ్వకుండా ఉండం’ అని పేర్కొన్నాయి. ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడికి అమెరికా ఉపయోగించిన బాంబుల సంఖ్యనే తమ సాయుధ దళాలు ఉపయోగించినట్లు ఇరాన్‌ అత్యున్నత భద్రతా సంస్థ తెలిపింది. అయితే, ఇరాన్‌ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ అధికారులు తెలిపారు.

ఈ మేరకు ఖతార్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ గగనతలం, భూభాగం సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. తమ పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించింది. పౌరులు, నివాసితులు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని, సూచనలను మాత్రమే పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఖతార్‌ ప్రకటించింది. మరోవైపు ఖతార్‌పై ఇరాన్‌ దాడులను సౌదీ తీవ్రంగా ఖండించింది.

Tags:    

Similar News