Iran Unrest: ఇరాన్పై అమెరికా దాడి.. భారత పౌరులకు హెచ్చరిక..
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన..
ఇరాన్లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, హింసాత్మక నిరసనలు మరియు భద్రతా పరిస్థితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం తన పౌరులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లోని అన్ని భారతీయ పౌరులు – విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు లేదా పర్యాటకులు – అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించి వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం కోరింది. జనవరి 5, 2025న భారత ప్రభుత్వం జారీ చేసిన సలహాకు ఈ సలహా పొడిగింపు అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.. ఇరాన్లో నిరంతరం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా , వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా మార్గం ద్వారా భారతీయ పౌరులు ఇరాన్ను విడిచి వెళ్లాలని సూచించారు.
ఇరాన్లో ఉన్న అన్ని భారతీయ పౌరులు మరియు PIOలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి నిరసనలు లేదా రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని మరియు పరిస్థితిపై తాజా పరిస్థితుల కోసం స్థానిక మీడియాను ఫాలో కావాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది.. భారత పౌరులు తమ ప్రయాణ మరియు ఇమ్మిగ్రేషన్ పత్రాలన్నింటినీ – పాస్పోర్ట్లు మరియు గుర్తింపు కార్డులు వంటివి – ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలని.. తక్షణమే అందుబాటులో ఉండాలని రాయబార కార్యాలయం కోరుతోంది. వారికి ఏదైనా సహాయం అవసరమైతే వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా వారు కోరారు.
ఇరాన్లో ప్రస్తుతం 180కి పైగా నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. నిరసనకారులకు మరణశిక్షలు అమలు చేస్తామని ఇరాన్ న్యాయశాఖ ఇప్పటికే ప్రకటించడంతో.. ప్రస్తుత పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
ఇరాన్లో ఆందోళనకారులను అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా సాగుతున్న ఈ నిరసనల్లో వేల సంఖ్యలో చనిపోవడం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇప్పటిదాకా 2,571 మంది చనిపోయినట్లు అమెరికా కేంద్రంగా పని చేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ బుధవారం తెలిపింది. ఇందులో 2,403 మంది నిరసనకారులు, 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ ఉద్రిక్తతలతో సంబంధం లేని 12 మంది చిన్న పిల్లలు.. మరో 9 మంది ప్రజలు మృతి చెందినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు 18 వేల మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఈ ఆందోళనలతో ఇరాన్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేశారు. అయితే కమ్యూనికేషన్ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్లింక్ ఫ్రీగా సేవలు అందిస్తున్నట్లు మానవ హక్కుల సంఘాలు చెప్పగా.. స్టార్లింక్ మాత్రం ఇంకా ధృవీకరించలేదు.