Indian-Origin Brothers : భారత సంతతి సోదరులకు 400 ఏండ్ల జైలు శిక్ష!
అమెరికాలో పలు ఆర్థిక నేరాలు
మనీలాండరింగ్, హెచ్1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో భారత సంతతికి చెందిన ఇద్దరు సోదరులను అమెరికాలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ‘సవానీ గ్రూప్’ పేరుతో పలు రకాల వ్యాపారాలు నడుపుతున్న భాస్కర్ సవానీ(60), అరుణ్ సవానీ(58)లకు దాదాపు 400 ఏండ్లకుపైగా జైలు శిక్ష పడే అవకాశముందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. వీరితోపాటు దోషిగా తేలిన అలెక్సాంద్రా రాడోమియాక్కు కోర్టు 40 ఏండ్ల జైలు శిక్ష విధించనున్నది! అమెరికాలో కొన్నేండ్లుగా వీరు ‘సవానీ గ్రూప్’ పేరుతో అక్రమ వ్యాపార కార్యకలాపాలను సాగిస్తూ కోట్లాది డాలర్లు కొల్లగొట్టారని ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు.
అమెరికా అటార్నీ కార్యాలయం గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్1బీ వీసాలకు సంబంధించి మోసపూరిత దరఖాస్తులు, పిటిషన్లు దాఖలు చేసి పెద్ద సంఖ్యలో విదేశీ కార్మికులను అమెరికాకు రప్పించి, అటు తర్వాత వారి వేతనాల నుంచి బలవంతంగా వసూలు చేశారని దర్యాప్తులో తేలింది. ఇందులో అత్యధికులు ఇండియన్స్ ఉన్నారని తెలిపింది. ఇక హెల్త్కేర్ పథకంలో అక్రమ బిల్లులు ప్రవేశపెట్టి 30 మిలియన్ డాలర్లు కొల్లగొట్టారని పేర్కొన్నది. వివిధ ప్రభుత్వ పథకాల్లో అక్రమంగా కొల్లగొట్టిన సొమ్మునంతా మనీలాండరింగ్ ద్వారా కార్పొరేట్ బ్యాంక్ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి.