Netanyahu: ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభమైందన్న నెతన్యాహూ

ఇజ్రాయెల్‌ దాడిలో రివల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ మృతి..;

Update: 2025-06-13 02:45 GMT

ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్‌కు అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. అందులో నటాంజ్ స్థావరం కూడా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో నెతన్యాహు ప్రకటించారు.

శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి. పక్కా ప్రణాళికతో ఈ దాడులు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక దాడుల్లో ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హుస్సేన్ సలామి అమరుడయ్యాడని స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మేజర్‌ జనరల్‌ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇజ్రాయెల్ దాడులతో ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధపడుతోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తం అయింది. దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరించింది.

Tags:    

Similar News