Israel: హిజ్బుల్లా కమ్యూనికేషన్ చీఫ్ హతం..
బీరుట్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం బయట దాడి;
ఇజ్రాయిల్ హిజ్బుల్లాను పూర్తిగా తుడిచివేయాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు నస్రల్లా వారసుడిని లక్ష్యంగా చేసుకున్నది. శుక్రవారం ఉదయం లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. హెజ్బొల్లా సీనియర్ నేత హషేమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తున్నది. నస్రల్లా మరణం తర్వాత హెజ్బొల్లాకు సఫీద్దీన్ నాయకత్వం వహించనున్నట్టు భావిస్తున్నారు. కాగా, హెజ్బొల్లా కమ్యూనికేషన్ విభాగం కమాండర్ మహమ్మద్ రషీద్ సకాఫిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. లెబనాన్పై తాము జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందారని చెప్పింది.
హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ పేర్కొన్నారు. ‘హెజ్బొల్లాకు ఒకదాని తర్వాత ఒకటి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మేము నస్రల్లాను హతమార్చాం. మా ఆయుధాగారంలో మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు జరగనున్నాయి. కొన్ని ఇప్పటికే చేపట్టాం, ఇంకొన్ని చేపట్టాల్సి ఉంది’ అని గలాంట్ అన్నారు.
ఇరాన్ మద్దతున్న హౌతీలపై అమెరికా, బ్రిటన్ శుక్రవారం దాడులు చేశాయి. యెమెన్లో ఆయుధ వ్యవస్థలు, స్థావరాలు, ఆయుధ పరికరాలు నిల్వ చేసిన ప్రదేశాలు లక్ష్యంగా వైమానిక, నౌకా దాడులు జరిపినట్టు ఒక అధికారి ధ్రువీకరించారు. కాగా, తమ ప్రధాన పోర్టు సిటీ హొడియాడ ఎయిర్పోర్టు, ప్రధాన మిలటరీ బేస్ ఉన్న కతియాబ్ లక్ష్యంగా ఏడు దాడులు జరిగినట్టు హౌతీ తెలిపింది. దీనికి ముందు మరొక కీలక హిజ్బుల్లా నేత మహ్మద్ అనిసిని చంపినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. ఇతను గైడెడ్ మిస్సైల్స్ డెవలప్మెంట్లో పాల్గొంటున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. అనిసి 15 ఏళ్ల క్రితం హిజ్బుల్లాలో చేరాడు. ఇదిలా ఉంటే, నస్రల్లా మరణం తర్వాత అతడి వారసుడిగా చెప్పబడుతున్న హషీమ్ సఫీద్దీన్ భూగర్భ బంకర్లో సమావేశానికి హాజరవుతున్న సమయంలో ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి భారీ దాడి చేసిందని ది న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది. ఈ దాడి నస్రల్లాని చంపిన దానికన్నా పెద్దదని, మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.
తాజాగా ఇరాన్ చేసిన క్షిపణుల దాడిని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సమర్థించుకున్నారు. ఈ దాడులు న్యాయమైనవని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్పై పోరాటం కొనసాగుతుందని, హమాస్, హెజ్బొల్లాకు ఇజ్రాయెల్ తీవ్రమైన హాని తలపెట్టలేదని, యూదుల దేశం(ఇజ్రాయెల్) ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నారు.