గాజాపై యుద్దం ప్రారంభించినప్పుడే.. హమాస్ అగ్రనేతలందరినీ హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఒకొక్కరిని వేటాడుతూ వచ్చింది. హమాస్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయెల్ హనియెను ఇటీవల టెహ్రాన్లో హతమార్చింది. మరో నేత మహమ్మద్ డెయిఫ్నూ మట్టుబెట్టింది. కొన్ని నెలలుగా గాజాపై చేస్తున్న దాడుల్లో దాదాపు కీలక కమాండర్లందరినీ చంపేసింది. ఇటీవల బీరుట్లోని హెజ్బొల్లా కార్యాలయంపై వైమానిక దాడులు నిర్వహించి...ఆ సంస్థ అధినేత నస్రల్లాను హతమార్చి కలకలమే సృష్టించింది. ఇప్పుడు సిన్వర్ మృతితో శత్రుశేషం దాదాపు పూర్తయినట్లే. మరోవైపు ఉత్తరగాజాలో గురువారం అబూ హుస్సేన్ పాఠశాలపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.