PM Modi: ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఇటలీ ప్రధాని
సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతున్న 'మెలోడీ' హ్యాష్ట్యాగ్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో పంచుకుంటూ, ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు.
"భారత ప్రధాని నరేంద్ర మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. కోట్లాది మంది ప్రజలను నడిపించడంలో ఆయన బలం, సంకల్పం, సామర్థ్యం ఎంతో స్ఫూర్తిదాయకం. భారత్ను ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడానికి, మన దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయనకు మంచి ఆరోగ్యం, శక్తి లభించాలని ఆకాంక్షిస్తున్నాను" అని మెలోనీ తన పోస్ట్లో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, మెలోనీ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికలపై, సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీరిద్దరి పేర్లను కలుపుతూ నెటిజన్లు సృష్టించిన 'మెలోడీ' అనే హ్యాష్ట్యాగ్ తరచుగా ట్రెండింగ్లో ఉండటం విశేషం.
ఈ నెల 10న ఇద్దరు నేతలు ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని వారు పునరుద్ఘాటించారు. 2026లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు మెలోనీ తన పూర్తి మద్దతును ప్రకటించారు. అలాగే, భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈఈసీ) వంటి కీలక అంశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం అవసరమని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జూన్లో కెనడాలో జరిగిన 51వ జీ7 సదస్సులో కూడా మోదీ, మెలోనీ సమావేశమై ఇరు దేశాల స్నేహాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.