Japan: పసిఫిక్ మహా సముద్రంలోకి అణు విద్యుత్ వ్యర్థజలాలు
మానవాళికి ముప్పేనని మండిపడుతున్న ఇతర దేశాలు;
పసిఫిక్ మహాసముద్రంలోకి జపాన్ తొలి విడత అణుజలాల విడుదలను ప్రారంభించింది. సునామీ దెబ్బతో నిరుపయోగంగా మారిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియో యాక్టీవ్ నీటిని తొలిసారిగా విడుదల చేశారు. కంట్రోల్ రూమ్లో టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ హోల్డింగ్స్ సిబ్బంది.. నీటి పంపును ఆన్ చేసి సముద్రంలోకి విడుదల చేసే వివాదాస్పద ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కొన్ని దశాబ్ధాల పాటు సాగనుంది.
ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ప్రస్తుతం 1.34 మిలియన్ టన్నుల అణువ్యర్థ జలాలు నిల్వ చేసి ఉంచారు. వెయ్యి ట్యాంకుల్లో ఈ రేడియో యాక్టీవ్ నీరు పోగుబడి ఉంది. 2023లో 31 వేల టన్నుల అణు వ్యర్థ జలాలను పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్ యోచిస్తోంది. 4 విడతలుగా ఒక్కో దఫాలో 7వేల 8వందల టన్నుల అణు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టనున్నారు.
జపాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని చైనా, దక్షిణ కొరియాతో సహా.. పసిఫిక్ ద్వీప దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జపాన్ది స్వార్థపూరిత, బాధ్యతారాహిత్య చర్య అని చైనా మండిపడింది. మానవాళికే జపాన్ ముప్పు తెచ్చిందని ఆక్షేపించింది. జపాన్ నుంచి దిగుమతి చేసుకునే సముద్ర ఆహార ఉత్పత్తులపై నిషేధం విధించింది. దక్షిణకొరియా కూడా సునామీ ప్రభావిత ప్రాంతాల్లో వేటాడిన చేపలు, వ్యవసాయ ఉత్పత్తులపై నిషేధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. జపాన్ చర్య వల్ల తమ ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపడతామని హామీ ఇచ్చింది.
అణువ్యర్థ జలాలను మహాసముద్రంలోకి విడుదల చేయడంపై అంతర్జాతీయంగానే కాకుండా స్వదేశంలోనూ ఆందోళనలు మిన్నంటాయి. భవిష్యత్ తరాలకు పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని ఫుకుషిమా ప్రిఫెక్చురల్ కార్యాలయం వద్ద నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పర్యావరణానికి హాని చేయద్దని విజ్ఞప్తి చేశారు. ఫుకుషిమా వల్ల ఇప్పటికే జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకోవాలని నినాదాలు చేశారు. అటు జపాన్ మత్స్యకారులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జలాలు విషతుల్యమైతే ఆహారం కలుషితమవుతుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
జపాన్ మాత్రం ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంటును మూసివేసేందుకు.. అందులోని అణు జలాలను సముద్రంలో కలపడం తప్ప మరో దారి లేదని తెలిపింది. సముద్రం తీవ్రంగా ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని.. ఒకేసారి కాకుండా పలు దఫాలుగా దశాబ్ధాల పాటు రేడియో యాక్టీవ్ నీటిని విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నీటిని వడగట్టి 60రకాల రేడియో యాక్టివ్ పదార్థాలను తొలిగిస్తున్నట్లు తెలిపింది.