Japan : మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా
ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగం వాయిదా;
జపాన్ దేశం తన మొట్ట మొదటి మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగాన్ని తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేసింది. హెచ్ 2 ఏ రాకెట్ జపాన్కు నైరుతిలో ఉన్న కగోషిమా ప్రిఫెక్చర్లోని తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9:26 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగం వాయిదా పడింది.
ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, రష్యా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేయగా.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇటీవలే రష్యా కూడా లూనా-25 ప్రయోగం చేసింది. కానీ అది విఫలమైంది. ఇక తాజాగా జపాన్ కూడా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి సమాయత్తమవుతున్నది.
స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) పేరిట జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా నేడు (సోమవారం) చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపించటానికి సిద్ధం అయ్యింది. జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్లోని యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి హెచ్2-ఏ రాకెట్ సోమవారం నింగిలోకి దూసుకెళ్లడానికి డేట్ ఫిక్స్ చేసింది. అయితే బలమైన గాలులు ఈ ప్రయోగాన్ని వాయిదా పడేలా చేసాయి.
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో చేయనున్న ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించనున్నది. కాగా, ప్రయోగించిన 3-4 నెలల తర్వాత ఈ స్పేస్క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనున్నది.