Biden: అమెరికా తప్పుకుంటే ఎవరు నాయకత్వం వహిస్తారు
ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన బైడెన్;
ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను జో బైడెన్ ఖండించారు. ప్రపంచ వేదిక నుంచి అమెరికా వైదొలగితే ఎవరు నాయకత్వం వహిస్తారని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తన మద్దతుదారులను ప్రశ్నించారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో మాట్లాడిన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ ఖండించారు. అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్ అన్నారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు మీరే గెలవాలని తనతో చెప్పారని వెల్లడించారు. యావత్ ప్రపంచం అమెరికావైపే చూస్తోందన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే, ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని బైడెన్ తెలిపారు. ఇప్పటి వరకు తమకు 500 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు.
తన ప్రచారం అద్భుతంగా ముందుకెళ్తోందని బైడెన్ తెలిపారు. ఇప్పటి వరకు తమకు 500 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని వెల్లడించారు. వీరిలో 97 శాతం మంది 200 డాలర్లకు దిగువనే ఇచ్చారని చెప్పారు.
అనేక సర్వేల్లో ట్రంప్ కంటే తానే ముందున్నానని బైడెన్ అన్నారు. ‘‘ఇప్పటి వరకు వెలువడిన 23 జాతీయ స్థాయి పోల్స్లో పదింటిలో నేనే ముందున్నాను. ట్రంప్ ఎనిమిదింటిలో ఆధిక్యంలో ఉన్నారు. ఐదింటిలో టై అయ్యింది. కచ్చితంగా పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్ పోల్లో ఎనిమిది పాయింట్లు ఎగబాకాం. ఎకెలన్ పోల్లో ఏడు పాయింట్లు మెరుగయ్యాం. మార్టిస్ట్ పోల్లో మూడు పాయింట్లు పెరిగాయి’’ అని బైడెన్ తన మద్దతుదారులకు వివరించారు.