Matthew Perry: 'ఫ్రెండ్స్' ఫేమ్ మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో కీలక తీర్పు
'కెటమైన్ క్వీన్'గా పేరుపొందిన జస్వీన్ సంఘాకు 15 ఏళ్ల జైలు
హాలీవుడ్ ప్రముఖ సిరీస్ 'ఫ్రెండ్స్' ఫేమ్, నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతడి మరణానికి కారణమైన కెటమైన్ అనే డ్రగ్ను సరఫరా చేసిన కేసులో భారత సంతతికి చెందిన జస్వీన్ సంఘా (42) అనే మహిళకు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హాలీవుడ్ ప్రముఖులకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ 'కెటమైన్ క్వీన్'గా పేరుపొందిన ఈమె, ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉంది.
బ్రిటిష్-అమెరికన్ పౌరసత్వం ఉన్న జస్వీన్ సంఘా.. లాస్ ఏంజెలెస్లోని తన విలాసవంతమైన అపార్ట్మెంట్ నుంచే పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా నడిపినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. 2023లో మాథ్యూ పెర్రీ తన ఇంట్లోని హాట్ టబ్లో అపస్మారక స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. పెర్రీ మరణానికి ముందు నెల రోజుల్లో జస్వీన్ సుమారు 51 కెటమైన్ వయల్స్ను ఎరిక్ ఫ్లెమింగ్ అనే వ్యక్తి ద్వారా అతడి సహాయకుడికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది.
పెర్రీ మరణవార్త తెలియగానే జస్వీన్ సంఘా.. ఎరిక్ ఫ్లెమింగ్ను 'సిగ్నల్' యాప్లో సంప్రదించి "మన మెసేజ్లన్నీ డిలీట్ చెయ్" అని ఆదేశించింది. ఇది సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నమేనని ప్రాసిక్యూటర్లు వాదించారు. 2019లో కోడీ మెక్లారీ అనే మరో వ్యక్తి మృతికి కూడా జస్వీన్ సరఫరా చేసిన డ్రగ్సే కారణమని వారు ఆరోపించారు.
ఉన్నత విద్యావంతురాలైన జస్వీన్ కేవలం డబ్బు, గ్లామర్ కోసమే ఈ మార్గాన్ని ఎంచుకుందని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, తన తప్పును అంగీకరించి, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటోందని, కాబట్టి శిక్ష తగ్గించాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, జస్వీన్ సంఘాకు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించారు.