Canada: మా దేశం నుంచే ఖలీస్థాన్ ఉగ్రవాదులకు నిధులు.. కెనడా సంచలన నివేదిక
వాంకోవర్ కాన్సులేట్ని ఆక్రమిస్తామని బెదిరింపులు..
నిధుల సేకరణ, భారత్లో హింసాత్మక చర్యలకు ప్రణాళిక కోసం ఖలీస్థాన్ వేర్పాటువాదులు తమ దేశాన్ని కేంద్రంగా చేసుకున్నట్టు కెనడా ప్రధాన గూఢచారి సంస్థ జూన్లో విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. కెనడా కేంద్రంగా ఖలీస్థాన్ వేర్పాటువాదుల కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అంగీకరించింది. ఇంకా చురుకుగానే ఉన్న కెనడాలో నిషేధిత ఉగ్రవాద నెట్వర్క్లు.. భారత్లో భద్రత పరిస్థితులను ప్రభావితం చేసేలా పనిచేస్తున్నట్టు గుర్తించింది. తాజాగా, ఉగ్రవాదులకు ఆర్ధిక సహాకారంపై కెనడా ప్రభుత్వం నివేదికలో ఖలీస్థానీలకు నిధులు కెనడా నుంచే అందుతున్నట్టు తెలిపింది. ఖలీస్థాన్ ఉగ్రవాద సంస్థలుగా కెనడా గుర్తించిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ వంటి వాటికి ఆర్ధిక మద్దతు కెనడా నుంచి అందుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించినట్టు నివేదిక స్పష్టం చేసింది.
కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాడులు బరితెగిస్తున్నారు. భారత్ రాయబార కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన ‘‘సిఖ్ ఫర్ జస్టిస్(SFJ)’’ వాంకోవర్లోని భారత కాన్సులేట్ను ముట్టడిస్తామని బెదిరింపులకు పాల్పడింది. భారత కాన్సులేట్ను గురువారం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. ఇండో కెనడియన్లు తమ సాధారణ పనుల కోసం కాన్సులేట్కు వచ్చే వారు వేరే తేదీని ఎంచుకోవాలని కోరింది.
కొత్త భారత హైకమిషనర్ దినీష్ పట్నాయక్ను ఖలిస్తానీలు టార్గెట్ చేస్తూ, ఓ పోస్టర్ను విడుదల చేసింది. భారత కాన్సులేట్ కార్యాలయాలు గూఢచార నెట్వర్క్ను నడుపుతున్నాయని, ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెడుతున్నాయని ఆ సంస్థ ఆరోపించింది. రెండేళ్ల క్రితం భారత్ గుర్తించిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీ్ప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంట్లో చెప్పారని సిఖ్ ఫర్ జస్టిస్ ఆరోపించింది.
గత నెల ప్రారంభంలో, కెనడా ప్రభుత్వం ఒక అంతర్గత రిపోర్టులో కెనడాలోని వ్యక్తులు, నెట్వర్క్ల నుంచి ఖలిస్తానీ గ్రూపులు ఆర్థిక సహాయం పొందుతున్నాయని అంగీకరించింది. ఈ గ్రూపుల్లో నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ SYF ఉన్నాయి, ఈ రెండూ కెనడా క్రిమినల్ కోడ్ కింద ఉగ్రవాద సంస్థలుగా జాబితా చేయబడ్డాయి. ఇప్పుడు ఈ తీవ్రవాద గ్రూపులు ఏ నిర్దిష్ట సంస్థతో ముడిపడి ఉండకుండా ఖలిస్తాన్ వాదానికి మద్దతు ఇచ్చే వ్యక్తుల చిన్న సమూహాల ద్వారా ఎక్కువగా పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది.