Japan: జ‌పాన్ మాజీ ప్ర‌ధానిపై దాడి కేసు నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష‌

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న కిషిదాపై నాటు బాంబుతో అటాక్;

Update: 2025-02-19 05:15 GMT

జ‌పాన్  మాజీ ప్ర‌ధాని ఫుమియో కిషిదాపై 2023లో నాటు బాంబు దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు రుజి కిమురాకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించారు. వ‌క‌యామా న‌గ‌రంలో పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ కోసం ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని కిషిదాపై బాంబు దాడి జ‌రిగింది. కిమురా త‌న వ‌ద్ద ఉన్న నాటు బాంబును ప్ర‌ధాని మీద‌కు విసిరాడు. అయితే ఆ పేలుడులో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాలు అయ్యాయి. పేలుడు ప‌దార్ధాలు, ఆయుధాలు క‌లిగి ఉన్న కేసులో .. కిమురాకు శిక్ష‌ను ఖ‌రారు చేశారు. అత‌నిపై మొత్తం అయిదు అభియోగాలు న‌మోదు చేశారు.

పైప్ బాంబుతో దాడి చేసిన కేసులో వ‌క‌యామా జిల్లా కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. 2023, ఏప్రిల్ 15వ తేదీన సాయిక‌జ‌కి ఫిషింగ్ పోర్టు వ‌ద్ద ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో అటాక్ జ‌రిగింది. అయితే 2022 జూలైలో మాజీ ప్ర‌ధాని షింజో అబెపై దాడి జ‌రిగిన ఏడాది లోపే ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. కిమురాకు 15 ఏళ్ల జైలుశిక్ష వేయాల‌ని ప్రాసిక్యూట‌ర్లు వాదించారు. కిష‌దాపై దాడి చేయ‌డానికి ఓ నెల రోజుల ముందు నిందితుడు ఆ పేలుడు ప‌దార్ధాన్ని ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది.

హాని చేయాల‌న్న ఉద్దేశంతో పేలుడు ప‌దార్ధాన్ని విస‌ర‌లేద‌ని, కేవ‌లం త‌న కోర్టు కేసుపై అంద‌రి దృష్టి ప‌డాల‌న్న ఉద్దేశంతో అటాక్ చేసిన‌ట్లు చెప్పాడు. పైప్ బాంబు ద్వారా కేవ‌లం పొగ వ‌స్తుంద‌ని భావించిన‌ట్లు తెలిపాడు. ఎగువ స‌భ ఎన్నిక‌ల విష‌యంలో క‌నీస వ‌య‌సు అర్హ‌తను త‌గ్గించాల‌ని కోరుతూ నిందితుడు కిమురా కోర్టులో కేసు దాఖ‌లు చేశాడు. అయితే ఆ కేసును కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News