King Charles: ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న కింగ్ చార్లెస్
క్యాన్సర్ నిర్ధరణ తర్వాత.. తొలిసారి బయటకి;
క్యాన్సర్ బారిన పడ్డ బ్రిటన్ రాజు చార్లెస్-3 తొలిసారి బయటకు వచ్చారు ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్ లో పర్యటించారు. తన సతీమణి రాణి క్యామిల్లా తో కలిసి ఈస్టర్ వేడుకలకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొనేందుకు సెయింట్ జార్జ్ చాపెల్ కు వచ్చిన చార్లెస్ దంపతులు సాధారణ పౌరులతో ఉల్లాసంగా గడిపారు. తన మద్దతుదారులతో కరచాలనం చేస్తూ పరిసరాల్లో కలియ తిరిగారు. అభిమానులతో ముచ్చట్లూ చెప్పారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలు రాజు చార్లెస్ను ఉద్దేశిస్తూ.. ‘ధైర్యంగా ఉండండి’ అని నినాదాలు చేశారు. క్యాన్సర్ బారీన పడినట్లు వ్యాధి నిర్ధారించిన తర్వాత ఇప్పుడిప్పుడే కింగ్ చార్లెస్ కోలుకుంటున్నారు.
ప్రిన్స్ విలియమ్, సతీమణి కేట్ మిడిల్టన్ మాత్రం ఈ సమయంలో కనిపించలేదు. కేట్ కూడా క్యాన్సర్ బారినపడినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ ఇటీవల ప్రకటించింది. సర్జరీ పూర్తయిందని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని తెలిపింది. ఇలా రాజకుటుంబంలో ఇద్దరు క్యాన్సర్ బారినపడటం బ్రిటన్వాసులను ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే చార్లెస్ బాహ్య ప్రపంచంలోకి వచ్చి అక్కడి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.