ఫ్రాన్స్ పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీని ఆ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ రద్దు చేశారు. యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఆయన పార్టీ నేషనల్ రినయసెన్స్కు షాక్ తగలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30, జూలై 7 తేదీల్లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఫ్రాన్స్ ప్రతిపక్షంలోని అతివాద నేషనల్ ర్యాలీ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ఆదివారం వెల్లడైంది. వలసదారులను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ ప్రతిపక్ష పార్టీకి మద్దతు 31-32 శాతం వరకు పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. మాక్రన్ పార్టీకి దాదాపు 15 శాతం మద్దతు లభిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈయూ ఎన్నికల్లో మాక్రన్ పోటీ చేయలేదు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉంది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలను గెల్చుకుంటే, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, బిల్లుల ఆమోదానికి మాక్రన్కు అవకాశం లభిస్తుంది.
గడువు కంటే ముందుగా నిర్వహించే ఎన్నికలనే స్నాప్ ఎలక్షన్స్ అంటారు. ముందస్తు ప్రకటనలు లేకుండానే, పూర్తిస్థాయి పదవీకాలం ముగియకముందే వీటిని నిర్వహించే వీలు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలు అధికార పార్టీలు తమ వ్యూహాల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల నుంచి లబ్ధి పొందేందుకు, ఏదైనా ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు దాని పరిష్కారం కోసం ఈ దిశగా అడుగులు వేస్తుంటాయి. ప్రస్తుతం మేక్రాన్ ప్రకటనకు గతవారం జరిగిన ఐరోపా యూనియన్ ఎన్నికలు కారణంగా తెలుస్తోంది. ఆ ఎన్నికల ఫలితాలు విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి అనుకూలంగా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. మేక్రాన్ పార్టీ రినైజన్స్కు 14.8 శాతం నుంచి 15.2 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొన్నాయి. ప్రతిపక్ష పార్టీకి మాత్రం 32 నుంచి 33 శాతం మధ్య ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. 2027లో తన పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తే.. ఆ పార్టీ మరింత పట్టు సాధిస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.