Makkah: మక్కా ప్రవేశంపై సౌదీ అరేబియా ఆంక్షలు..

నేటి నుంచే కొత్త నిబంధనల అమలు

Update: 2026-04-13 05:30 GMT

హజ్ యాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మక్కా నగర ప్రవేశంపై కీలక ఆంక్షలు విధించింది. ఈరోజు నుండి అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులు, స్థానిక నివాసితులు ఎవరూ మక్కాలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది.

కేవలం మక్కాలో పని చేసే వర్క్ పర్మిట్ ఉన్నవారు, అక్కడ జారీ చేసిన రెసిడెన్సీ ఐడీ (ఇఖామా) కలిగిన వారు లేదా చెల్లుబాటు అయ్యే హజ్ పర్మిట్ ఉన్నవారిని మాత్రమే నగరంలోకి అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించి వచ్చే వారిని సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్దే నిలిపివేసి వెనక్కి పంపేలా కఠిన చర్యలు చేపట్టారు.

మరోవైపు ఉమ్రా వీసాలపై వచ్చిన విదేశీయులకు ఏప్రిల్ 18 వరకు మాత్రమే గడువు విధించారు. ఈ లోపు వారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఏప్రిల్ 18 నుండి మే 31 వరకు 'నుసుక్' ప్లాట్‌ఫారమ్ ద్వారా పౌరులు మరియు జీసీసీ దేశాల వారికి ఇచ్చే ఉమ్రా పర్మిట్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 18 తర్వాత కేవలం హజ్ వీసా ఉన్న వారిని మాత్రమే మక్కాలోకి అనుమతించనున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. పవిత్ర హజ్ యాత్రను ప్రశాంతంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు యాత్రికులందరూ సహకరించాలని కోరింది.

Tags:    

Similar News