Muizzu: 15 గంటల పాటు విలేకరుల సమావేశం.. ముయిజ్జు రికార్డు
జెలెన్స్కీని అధిగమించిన మాల్దీవ్స్ అధ్యక్షుడు;
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు రికార్డు నెలకొల్పారు. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశాధ్యక్షుడిగా ముయిజ్జు నిలిచారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించారని అధికారులు తెలిపారు.
మధ్యలో ప్రార్థనల కోసం చిన్న విరామం ఇచ్చి 14 గంటల 54 నిమిషాలపాటు ప్రసంగించారని మాల్దీవ్స్ అధ్యక్ష కార్యాలయం అధికారులు చెప్పారు. ఈ సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా భాగం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని తెలిపారు. శనివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్తో ఇప్పటివరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరిట ఉన్న రికార్డును ముయిజ్జు అధిగమించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
గతంలో 2019 అక్టోబర్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 14 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రికార్డు నెలకొల్పారు. కాగా 2009లో మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మొహమ్మద్ నషీద్ హిందూ మహాసముద్రం అడుగున క్యాబినెట్ సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గ్లోబల్ వార్మింగ్ మూలంగా సముద్ర మట్టాలు పెరగడంతో దిగువ స్థాయిలో ఉన్న తమ దేశం మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి అప్పట్లో ఆయన ఈ విధంగా వినూత్న నిరసన తెలిపారు.