India: రష్యాసైన్యం లో భారతీయుని మృతిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం

భారతీయుల్ని విడుదల చేయాలని డిమాండ్;

Update: 2025-01-15 00:22 GMT

రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీన్ని భారత విదేశాంగ శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను తక్షణమే విడుదల చేయాలని రష్యాను భారత్ కోరింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ఎంత త్వరగా విడుదల చేస్తారో.. అంత త్వరగా భారతీయులను విడుదల చేయాలని డిమాండ్ చేసినట్లు భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కేరళకు చెందిన టీబీ బినిల్‌ (32) అనే యువకుడు రష్యా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అతడి సమీప బంధువు టీకే జైన్‌ (27)కు గాయాలయ్యాయి. బినిల్‌ చనిపోయిన విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసిందని అతడి బంధువులు మీడియాతో చెప్పారు. ఈ విషయం తెలిసి బినిల్‌ భార్య షాక్‌కు గురైంది. రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

టీబీ బినిల్ మృతి పట్ల కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. గాయపడిన జైన్‌ను కూడా విడుదల చేసి, ఇండియాకు పంపించాలని కోరినట్లు ఎక్స్‌ పోస్టులో వెల్లడించారు. గతేడాది రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్‌ సదస్సు జరిగింది. ఆ సమయంలో ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది.

Tags:    

Similar News