POK: మాపై ఎందుకీ సవతి తల్లి ప్రేమ
పాకిస్థాన్ ప్రభుత్వంపై పీవోకే ప్రజల ఆగ్రహం... ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ ఆందోళనలు...;
ఓ పక్క ఆర్థిక సంక్షోభం.. మరోపక్క ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్నపాకిస్థాన్కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఎప్పుడూ భారత్పై విషం చిమ్మే దాయాది దేశానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(Pakistan occupied Kashmir) ప్రజలు కన్నెర్ర చేశారు. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారంటూ(against Pakistan's treatment of the region) మండిపడ్డారు. POKను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్తో పోలిస్తే తమపై అధికంగా ధరల భారం మోపుతున్నారంటూ వాపోతున్నారు.. ఇంతకీ దాయాది దేశంలో ఏం జరుగుతోంది..
పీవోకే ప్రజలు(POK citizens).. పాకిస్తాన్పై తిరుగుబాటు(demonstration) మొదలైంది. పీవోకేను దాయాది దేశం చిన్నచూపు చూస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. పాక్లోని వేరే ప్రాంతాలతో పోలిస్తే పీవోకేలో విద్యుత్ బిల్లులు అధికంగా వసూలు చేయడం, గోధుమలపై రాయితీ ఎత్తివేయడంపై మండిపడుతున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్పై తిరుగుబావుటా ఎగరేశారు. డిమాండ్లను పరిష్కరించే వరకు తగ్గబోమంటూ పీవోకే ప్రజలు ఆందోళనల బాట పట్టారు.
పీవోకే పౌరులపై సవతి ప్రేమ చూపిస్తున్న పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్లోని ఇతర ప్రాంతాల వలె తమనూ చూడాలన్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ POK వాసులు ఆందోళనలు చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలనీ లోడ్ షెడ్డింగ్ను పరిష్కరించాలనీ గోధుమ పిండిపై రాయితీని పునరుద్ధరించాలనీ కోరుతున్నారు.
పీఓకేలో విద్యుత్ బిల్లులు పాక్లోని ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువ ఉన్నాయని స్థానికులు నెలలుగా నిరసనలు చేస్తున్నారు. వేలమంది వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 18గంటల విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో విద్యాసంస్థలు, వ్యాపారాలు, నివాసాలు, ఆస్పత్రులు అన్ని రంగాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో నలిగిపోతున్న తమపై పాక్ చూపుతున్న వివక్ష POK పౌరులను మరింత కలవరపెడుతోంది. శాంతియుత నిరసనలు చేస్తే సైన్యం, పోలీసులతో అణచివేస్తున్నారు. POK పూంచ్ ప్రాంతంలో నిరసన తెలిపిన యువకులపై కాల్పులు కూడా జరిపారు.
పీఓకేలో ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. బాగ్, ముజఫరాబాద్తో సహా అనేక ప్రాంతాలు గోధుమ పిండి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ పీఓకేలో సబ్సిడీ గోధుమల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. కిరాణా దుకాణాల్లో వంట వస్తువులు అయిపోతున్నాయి. గోధుమ పిండి కొరత వల్ల బ్రెడ్, బేకరీ వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.