Pak train hijack: పాక్‌లో రైలు హైజాక్‌

30 మంది భద్రతా సిబ్బంది మృతి, మిలిటెంట్ల చెరలో 182 మంది!;

Update: 2025-03-12 01:15 GMT

పాకిస్థాన్‌లో వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి, హైజాక్‌ చేశారు. ఆరుగురు భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే, ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని అనధికార సమాచారం. మిలిటెంట్లు 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువమంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులున్నారు. కాగా, పాకిస్థాన్‌ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని, 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయి. 80 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. సమస్యాత్మక బలోచిస్థాన్‌ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీస్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవరు సహా పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ దాడి తమ పనే అని వేర్పాటువాద మిలిటెంట్‌ గ్రూపు బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ప్రభుత్వం తమపై ఏదైనా మిలటరీ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తే.. భద్రతాదళాలు వెనక్కు తగ్గకపోతే అందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మహిళలు, చిన్నారులను విడిచిపెట్టినట్లు బీఎల్‌ఏ చెబుతున్నప్పటికీ.. వారిని రక్షణ కవచాలుగా వాడుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రక్షణ కోసం మరో రైలును అక్కడకు పంపించామని వివరించాయి. పాక్‌లోని బలోచిస్థాన్‌కు ఇరాన్, అఫ్గానిస్థాన్‌ సరిహద్దులు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా - పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సిపెక్‌) బలోచిస్థాన్‌ మీదుగా వెళ్తుండటం ఈ దాడులకు ప్రధాన కారణం. ఆర్థిక వృద్ధికి సిపెక్‌ తోడ్పడుతుందని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆశిస్తుండగా.. తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికి ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు.

పాకిస్థాన్‌లోని దాదాపు 44 శాతం భూభాగం తన సొంతమైన బలోచిస్థాన్‌ ప్రావిన్సులో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్‌ ఖజానా నింపుతోంది. కోటిన్నర జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో శక్తిమంతుడైన అహ్మద్‌ యార్‌ ఖాన్‌ స్వతంత్ర బలోచ్‌ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బలోచిస్థాన్‌లో సోవియట్‌ యూనియన్‌ (రష్యా) తిష్ఠ వేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్థాన్‌ సైన్యం బలోచ్‌ భూభాగంలోకి ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1948 మార్చి 27న అహ్మద్‌ యార్‌ ఖాన్‌ విలీనపత్రంపై బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. నాటి నుంచీ ఈ ప్రాంతంలో రగులుతున్న అసంతృప్తి నేటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే ‘బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (బీఎల్‌ఏ). సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్‌ బలోచిస్థాన్‌ ఏర్పాటు చేసుకోవడమన్నదే వీరి లక్ష్యం. గత అయిదేళ్లుగా ఈ పోరాటం తన పంథా మార్చుకొని మిలిటెన్సీ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై ‘బలోచ్‌ నేషనల్‌ ఆర్మీ’ ఏర్పాటు చేశాయి. పాక్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌ బీఎల్‌ఏను ఉగ్రసంస్థగా ప్రకటించాయి.

Tags:    

Similar News