లండన్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోయింది. దీంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ప్రమాదం తర్వాత విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు నాలుగు విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ వైట్సైట్ పేర్కొంది. అయితే విమానంలో ఎంత మంది ఉన్నారు? వారి పరిస్థితి ఏంటి? అనేది మాత్రం అధికారులు వెల్లడించలేదు.
లండన్లోని సౌథెండ్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం చిన్న విమానం కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక, అంబులెన్స్ బృందాలు సహా అత్యవసర సేవలు హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇక విమానం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.