PM Modi : 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాకు భారత ప్రధాని

సెల్ఫీ షేర్‌ చేసిన మోదీ;

Update: 2024-07-10 05:45 GMT

ఆస్ట్రియాతో సంబంధాలను బలోపేతం చేసుకొనే దిశగా భారత్‌ మరో అడుగు ముందుకేసింది. ప్రధాని మోదీ నేడు ఆస్ట్రియాకు వెళ్లారు. ఆ దేశ ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మెర్‌తో భేటీ అయ్యారు. మన దేశ ప్రధాని ఒకరు ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా ఇందిరాగాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఇరుదేశాలు దౌత్య సంబంధాలు ఏర్పాటుచేసుకొని 75ఏళ్లు పూర్తయినట్లు భారత విదేశాంగశాఖ ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

‘‘అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మెర్‌కు ధన్యవాదాలు. ఇరుదేశాలు కలిసి ప్రపంచం కోసం పని చేస్తాయి’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో తెలిపారు. ఈసందర్భంగా ఆయనతో కలిసి దిగిన చిత్రాలను షేర్‌ చేశారు. అంతకుముందు ప్రధాని మోదీకి వియన్నా విమానాశ్రయంలో ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్‌ స్కాలెన్‌ బర్గ్‌ స్వాగతం పలికారు. అనంతరం మంగళవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) ప్రధాని మోదీకి ఛాన్సలర్‌ కార్ల్‌ ఆతిథ్యం ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఛాన్సలర్‌ కార్ల్ అక్కడి వ్యాపారవేత్తలతో కూడా భేటీ కానున్నారు. భారతీయ మూలాలున్న వ్యక్తులతో నేడు వియన్నాలో ప్రధాని భేటీ కానున్నారు.

Tags:    

Similar News