PM Modi : మా ‘నాటు' పాటకు స్టెప్పులేస్తున్న అమెరికా యూత్ : ప్రధాని మోదీ
అమెరికా వైట్హౌస్లో ప్రపంచ ప్రముఖుల ముందు 'నాటు నాటు’ పాటను హైలైట్ చేసిన భారత ప్రధాని మోదీ;
గురువారం, అమెరికా వైట్హౌస్లో విందుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రసంగంలో 'నాటు నాటు’ పాటను హైలైట్ చేస్తూ మాట్లాడారు. భారత్, అమెరికాల మధ్య బలపడ్డ సంబంధాల గురించి చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“ రోజులు గడిచే కొద్దీ, భారత్, అమెరికన్ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇప్పుడు మా ఇరు దేశీయులు ఒకరి పేరును మరొకరు తడబడకుండా ఉచ్చరించగలం, యాసను మనం బాగా అర్థం చేసుకోగలం. భారతదేశంలోని యువత హాలోవీన్ రోజున అమెరికా స్పైడర్ మ్యాన్ వేషం ధరిస్తే, అమెరికా యువత మా ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేస్తున్నారు.”
- ప్రధాని నరేంద్ర మోదీ
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ భారత ప్రధాని కోసం ఏర్పాటు చేసిన గౌరవ విందులో ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు నవ్వులు కురిపించాయి.
జక్కన్న దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు నటించిన 'RRR'లోని ‘నాటు నాటు' పాట ప్రపంచవ్యాప్తంగా ప్రతి గల్లీలోనూ మారుమ్రోగింది. అందుకే ఈ తెలుగు ఘాటు పాటను ఆస్కార్ వరించింది. ఈ హిట్ ట్రాక్ విడుదలై ఏడాదిన్నర దాటినా ప్రజల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు వైట్ హౌస్లో ప్రపంచ ప్రముఖల నడుమ మరోసారి ఈ సాంగ్ ప్రస్థావన వచ్చింది.
వైట్ హౌస్లో 'నాటు నాటు'
వైట్ హౌస్ సౌత్ లాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్లో విందుకు దాదాపు 400 మందికిపైగా అతిథులు హాజరయ్యారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ పాల్గొన్నారు. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సహా పులువురు భారతీయ వ్యాపార దిగ్గజాలూ ఉన్నారు.