Vladimir Putin : నేడు భారత్కు పుతిన్.. ప్రధాని మోదీతో భేటీ..!
Vladimir Putin : నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. రక్షణ ఒప్పందాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది.;
Vladimir Putin : నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. రక్షణ ఒప్పందాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఇరు దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు సెర్గీ లవ్రోవ్, సెర్గీ షొయిగు; ఎస్.జైశంకర్, రాజ్నాథ్సింగ్లు 2+2 తరహా చర్చలు జరపుతారు. రెండు దేశాల మధ్య ఈ తరహా చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఇండియా ఇప్పటి వరకు అమెరికాతో మాత్రమే 2+2 తరహా చర్చలు జరిపింది. మరోవైపు... భారత్, రష్యాల 20వ ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీకి వస్తున్నారు. కరోనా తర్వాత.. ఆయన విదేశీయానం చేయడం ఇదే తొలిసారి. పుతిన్ పర్యటన ఇరుదేశాల చిరకాల మైత్రిని మరింత బలోపేతం చేయనుంది.
రక్షణ, అణు, ఇంధన, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని నిలువరించేందుకు ఏర్పడిన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ క్వాడ్ కూటమిపై అసంతృప్తిగా ఉన్న మాస్కో- ఇటీవల బీజింగ్తో సాన్నిహిత్యం పెంచుకుంటోంది. చైనా నుంచి ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతోనే రష్యా నుంచి ఎస్-400 క్షిపణులతో పాటు పలురకాల ఆయుధ సంపత్తిని ఇండియా సమకూర్చుకుంటోంది. వీటి కొనుగోలు తమ రక్షణ ప్రయోజనాలకు విఘాతకరమని, డేటా చోరీకి ఆస్కారముందని భావిస్తున్న అగ్రరాజ్యం కాట్సా ఆంక్షల విధింపుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో పుతిన్ పర్యటన ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది...
భారత్- రష్యా మైత్రి ఇప్పటిది కాదు. స్వాతంత్య్రానంతరం రక్షణ, సైనిక సహకారానికి రష్యాపైనే ఆధారపడిన భారత్- ఇప్పటికీ 62శాతం ఆయుధ సంపత్తి, సైనిక పరికరాలను ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటోంది. నాటి బ్రహ్మోస్ క్షిపణి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, చక్ర-2 జలాంతర్గాములు, టీ-90, టీ-72 యుద్ధట్యాంకులు వంటివి వాటిలో కొన్ని. తాజా పర్యటనలో ఎస్-400 క్షిపణి వ్యవస్థ సహా 6.71 లక్షల ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల కొనుగోలు ఒప్పందాలు ఖరారు కానున్నాయి. వీటి వాణిజ్య విలువ సుమారు అయిదు వేల కోట్ల రూపాయలు. ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీలో నెలకొల్పనున్న ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఐఆర్ఆర్పీఎల్)లో వాటి తయారీ చేపట్టనున్నారు. తొలుత 70 వేల తుపాకులను తమ వద్దే తయారుచేసి ఇండియాకు దిగుమతి చేయనున్న మిత్రదేశం- ఆ తరవాత సాంకేతికతను బదిలీ చేసి దేశీయంగానే ఉత్పత్తిని ప్రారంభించనుంది. మేకిన్ ఇండియా నినాదానికి ఇది ఆచరణరూపంగా కేంద్రం చెబుతోంది.