Singapore Airlines: సింగపూర్ ఎయిర్లైన్స్ సీఈవో బహిరంగ క్షమాపణ
భయానక అనుభవానికి చింతిస్తున్నాం అంటూ ప్రకటన;
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైన ప్రమాదంలో బ్రిటన్కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే ఈ ఘటన పట్ల ఎయిర్లైన్స్ సీఈవో గో చూన్ ఫాంగ్ (Goh Choon Phong) బహిరంగ క్షమాపణ చెప్పారు. భయానక అనుభవానికి చాలా చింతిస్తున్నామని తెలిపారు. సింగపూర్ ఎయిర్లైన్స్ తరఫున ప్రియమైన వారికి కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎస్క్యూ321 (SQ321) విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధాకరమైన అనుభవానికి చింతిస్తున్నామని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన అన్నిరకాల సహాయాన్ని అందించడానికి సింగపూర్ ఎయిర్లైన్స్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో క్షేమంగా బయటపడిన 143 మంది ప్రయాణికులు, సిబ్బందిని మరో విమానంలో వారి గమ్య స్థానాలకు తరలించామని, మిగిలిన 79 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రస్తుతం బ్యాంకాక్ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మంగళవారం లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన ఎస్క్యూ321 విమానం మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. ఈ ప్రమాదంలో బ్రిటన్కు చెందిన ఓ వృద్ధుడు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. ప్రయాణికుల్లో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. విమానాన్ని బ్యాంకాక్కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించారు.
211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో మంగళవారం లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న బోయింగ్ 777-300ఈఆర్ విమానం మార్గమధ్యంలో హఠాత్తుగా 37 వేల అడుగుల నుంచి మూడు నిముషాల వ్యవధిలోనే 31 వేల అడుగుల కిందకు దిగివచ్చింది. దీంతో విమానంలో తీవ్ర కుదుపులు చోటుచేసుకున్నాయి. దీంతో భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.