South Korea : దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీజే వివరాలివే.
ఒకనాటి బాలకార్మికుడే.. ఇప్పుడు దేశాధ్యక్షుడు;
అధ్యక్ష ఎన్నికల్లో లీ జే-మ్యుంగ్ నెగ్గడంతో దక్షిణ కొరియాలో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడిందనే చెప్పాలి. గత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ డిసెంబరులో అత్యయిక పరిస్థితి విధించాలన్న నిర్ణయం తీసుకోవడంతో ఆ దేశం రాజకీయ సంక్షోభంలో చిక్కుకొంది. అనంతర పరిణామాల్లో యూన్పై పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాన్ని ధ్రువీకరించడానికి రాజ్యాంగ న్యాయస్థానం సమయం తీసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ కాస్త ఆలస్యమైనా, అంతిమంగా దక్షిణ కొరియా ప్రజలు బలమైన తీర్పునే ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన 61 ఏళ్ల లీని గెలిపించి, అధికార పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన కిమ్ మూన్ సూను ఓడించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే శక్తులకు తాము మద్దతివ్వబోమన్న సంకేతాన్నిచ్చారు.
లీ జే-మ్యుంగ్ 1963లో నిరుపేద కుటుంబంలో జన్మించారు. బాలకార్మికుడిగా పనిచేస్తూనే చదువును కొనసాగించారు. 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986లో బార్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులై లాయరుగా ప్రాక్టీసు ప్రారంభించారు. పేదలు, కార్మికుల పక్షాన ఎక్కువ కేసులు పోరాడిన ఆయనకు మానవ హక్కుల న్యాయవాదిగా మంచి పేరుంది. 2005లో లీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆరంభంలో ఎదురుదెబ్బలు తిన్నా తర్వాత కాలంలో మేయర్గా, గవర్నర్గా ఎన్నికై పాలనలో తన సత్తా నిరూపించుకున్నారు. 2022 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. కేవలం 0.73 శాతం ఓట్లతోనే పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్ చేతిలో లీ ఓడిపోయారు.
లీపై పలు కేసులు ఉన్నాయి. కొన్నింటిలో అభియోగాలు తీవ్రమైనవి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలోనే ఆయన కేసులపై విచారణను కోర్టులు నిలిపివేశాయి. పదవిలో ఉన్నంతకాలం ఈ కేసులు ముందుకు కదలకపోవచ్చు. ఈ విషయంలో దక్షిణ కొరియా అధ్యక్షుడికి చట్టపరంగానూ మినహాయింపు ఉంది. లీపై 2024లో హత్యాయత్నం కూడా జరిగింది. ఆటోగ్రాఫ్ అడుగుతూ ఓ వ్యక్తి ఆయన మెడపై బలమైన గాయం చేశాడు. దాదాపు రెండు గంటలు వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. తాగి వాహనం నడిపిన కేసు కూడా లీపై నమోదైంది. 2018లో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలూ ఆయనపై వచ్చాయి. 2022కు సంబంధించిన ఎన్నికల కేసులో కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. తర్వాత అప్పీల్కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించినా.. ఆ తీర్పును సుప్రీంకోర్టు తిరస్కరించింది.