Jammu Kashmir: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం..
గందర్బాల్ దాడిలో ఆరుగురు కార్మికులను చంపిన ఉగ్రవాది హతం.;
జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు ఘన విజయం లభించింది. గందర్బాల్లో ఓ ప్రైవేట్ కంపెనీ హౌసింగ్ క్యాంపులో ఆరుగురు కార్మికులను, వైద్యుడిని చంపేసిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదిని పాకిస్తాన్కి చెందిన లష్కరేతోయిబాకి చెందిన జునైద్ అహ్మద్ భట్గా గుర్తించారు. ఈ ఉగ్రవాది గగాంగీర్, ఇతర ప్రదేశాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా పాల్గొన్నాడు.
హతమైన ఉగ్రవాది జునైద్ని ‘‘A’’ కేటగిరి ఉగ్రవాదిగా గుర్తించారు. నాన్ లోకల్స్, సాధారణ కార్మికులను టార్గెట్ చేస్తూ దాడులు చేయడంతో ఇతడి పాత్ర ఉంది. భట్ కుల్గామ్ నివాసిగా పోలీసులు తెలిపారు. ఒక ఏడాది కాలంగా ఇతను అదృశ్యమయ్యాడు. గందర్బాల్ దాడి సమయంలో ఇతను ఏకే సిరీస్ అసాల్ట్ రైఫిల్ని పట్టుకోని వెళ్లడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని డాచిగామ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జునైద్ హతమయ్యాడు. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల్లో ఇతను ఉన్నాడు. సోమవారం ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికకు సంబంధించిన స్పష్టమైన సమాచారం రావడంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు మంగళవారం ఉదయం ఆపరేషన్ మళ్లీ ప్రారంభించాయి.