Mali: మహిళా టిక్టోకర్ను చంపిన ఉగ్రవాదులు
జిహాదీకి వ్యతిరేకంగా వీడియోలే కారణం ?
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అల్ఖైదా, ఐసిస్ ఉగ్రవాదం పెచ్చుమీరుతోంది. ఇక్కడ సైన్యానికి-ఉగ్రవాదుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఐసిస్ దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి. ఇటీవల ఐదుగురు భారతీయ కార్మికులను కూడా కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి జాడ కూడా కనిపించలేదు. ఇంతలోనే ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పూనుకున్నారు. జిహాదీకి వ్యతిరేకంగా వీడియోలు చేసిందన్న కారణంగా ఒక మహిళా టిక్టోకర్ను బహిరంగంగా ఉరితీసి చంపేశారు.
2012 నుంచి మాలిని ఉగ్రవాదం పట్టిపీడిస్తోంది. జిహాదీకి వ్యతిరేకంగా సైన్యం పోరాడుతుంది. అయితే తాజాగా మరియం సిస్సే అనే మహిళా టిక్టోకర్ సైన్యానికి సహకరిస్తుందన్న కారణంగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం బహిరంగంగా ఉరి తీసి చంపేశారు. మరియం సిస్సే మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కిడ్నాప్ చేసి.. అనంతరం ఉరితీశారని తెలిపారు. గురువారం తన సోదరిని జిహాదీలు తీసుకెళ్లారని.. మరుసటి రోజు బైక్పై టోంకాకు తీసుకెళ్లినట్లు తెలిపాడు. అనంతరం ఇండిపెండెన్స్ స్క్వేర్లో కాల్చి చంపేశారని చెప్పాడు. అందరూ చూస్తుండగానే చంపేశారని వాపోయాడు.
మరియం సిస్సే.. ఉత్తర టింబక్టు ప్రాంతంలోని టోంకా నగరం గురించి వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఈమెకు 90,000 మంది అనుచరులు ఉన్నారు. అయితే యువతి సైన్యానికి సహకరిస్తుందన్న కారణంతో చంపేసినట్లుగా సమాచారం. ఇది అనాగరిక చర్యగా స్థానిక అధికారి పేర్కొన్నాడు.